అనాథ అశ్రమంలో పెరుగుతున్న ఓ యువతి వివాహం ఘనం నిర్వహించారు. అనాథ యువతికి అన్ని తానై పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఈ పెళ్ళి వేడుకను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం వేదిక కాగా, జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం మొత్తం అండగా నిలిచి, అనాథ యువతికి చీర సారే ఇచ్చి ఘనంగా సాగనంపారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజా పాలనతోపాటు సామాజిక సేవలో ముందుండి ఆదర్శంగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తన సతీమణికి ప్రభుత్వ ఆసుపత్రి లోనే ప్రసవం చేపించారు. తాజాగా ఓ అనాథ ఆశ్రమంలో పెరిగిన అమ్మాయికి ఘనంగా వివాహం జరిపించారు. అనాథ యువతికి వివాహం నిశ్చయం కాగా, తన సహాయ సహకారాలతో పెళ్ళి పెద్దగా వివాహం జరిపించారు. అదీకూడా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో, జిల్లా యంత్రాంగం సమక్షంలో జరిపించారు.
రామగుండం తబిత ఆశ్రమంలో పెరుగుతున్న మానస డిగ్రీ పూర్తి చేసింది. జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్ తో వివాహం నిశ్చయం అయ్యింది. ఈ విషయాన్ని జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల రావు ద్వారా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహానికి అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తానని, కలెక్టరెట్ లోని వెంకటేశ్వర స్వామి అలయంలో వివాహం చేయాలని నిర్ణయించారు. ఇంకేముంది జిల్లా అధికార యంత్రాంగం అంతా మానస వివాహం చేయడంలో భాగస్వామ్యం అయ్యారు. పెళ్ళి పనులు చకాచకా ముందుకు సాగాయి. పెళ్ళి పెద్దగా కలెక్టర్ పేరు మీద పెండ్లి పత్రికలని ముద్రించారు. అందరిని అహ్వనం పలికే బాధ్యతలను జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాలరావు, అడిషనల్ కలెక్టర్ అరుణ బాధ్యతలు తీసుకున్నారు.
వీడియో చూడండి…
16 సంవత్సరాలు అనాధ అశ్రమంలోనే పెరిగిన మానస-రాజేష్ ల వివాహాం బుధవారం(మే 21) కలెక్టరేట్ ప్రాంగణంలోని అలయంలో కలెక్టరేట్ ఉద్యోగులు చేదోడుగా నిలిచి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. మానస కి 16 సంవత్సరాలుగా అన్నీతానై అండగా నిలిచారు వీరేందర్. ఇప్పుడు వివాహానికి జిల్లా కలెక్టరెట్ ఉద్యోగులే అండగా నిలిచి వివాహం జరిపించారు. ఉదయం 11:05 నిమిషాల సుముహుర్తాన వధూవరులు ఒకటి చేశారు. వివాహానికి టీఎన్జీవో సంఘం తరుపున 61 వేల 800 రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష పెండ్లి పెద్దగా వివాహం జరిపించి ఆశీర్వదించగా.. ప్రభుత్వం ఉద్యోగులే అండగా నిలిచి మానస అనాథ కాదు, మా అందరి బిడ్డ అని వివాహం జరిపించి చీరసారే కట్నకానుకులు ఇచ్చి సాగనంపారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..