ఇంత నాగరికత, ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా.. ఇంకా కొంతమందిలో మూఢనమ్మకాలు పాతుకపోయి ఉన్నాయి. మంత్రాల నెపంతో ఐదు మంది ఉన్న కుటుంబాన్ని గ్రామం మొత్తం కలిసి సజీవ దహనం చేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అమానష సంఘటన మరెక్కడా కాదు బీహార్లోని పూర్ణియా జిల్లాలో జరిగింది. పూర్ణియా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని రాజిగంజ్ పంచాయతీలోని టెట్గామా వార్డ్ 10లో దాదాపు 200 మంది సమక్షంలో గ్రామంలోని ఒక కుటుంబాన్ని సజీవ దహనం చేశారు. 65 ఏళ్ల కటో దేవిపై చేతబడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గ్రామస్తులు ఆమెను మంత్రగత్తె అని నిందించారు.
అందుకోసం ఒక రోజు పంచాయితీ ఏర్పాటు చేసి కటో దేవితో పాటు ఆమె కుమారుడు బాబు లాల్ ఒరాన్ (50), కోడలు సీతా దేవి (48), మనవడు మంజిత్ ఒరాన్ (25), మంజిత్ భార్య రాణి దేవి (23), 12 ఏళ్ల సోనులను పిలిచారు. కటో దేవి చేతబడి చేస్తుందని నిందిస్తూ.. మొత్తం కుటుంబాన్ని సజీవ దహనం చేయాలని పంచాయితీలో తీర్మాణించారు. అందరూ చూస్తుంగానే వారికి నిప్పు పెట్టారు. ఇదంతా జరుగుతుండగా 12 ఏళ్ల సోను ఏదో ఒక విధంగా అక్కడి నుండి పారిపోయి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. మొత్తం సంఘటన గురించి పోలీసులకు చెప్పింది అతనే. ఇప్పుడు ఆ కుటుంబంలో సోను ఒక్కడే మిగిలి ఉన్నాడు.
ఈ దమన కాండ గురించి పోలీసులకు తెలిసిన వెంటనే మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్పీతో సహా అనేక మంది అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మంత్రగత్తె అనే ఆరోపణ కారణంగా హత్య జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో గ్రామ పెద్ద నకుల్ ఒరాన్, ఇతర నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి