ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదులుతోంది. ఇప్పటికే జోన్ ప్రధాన కార్యాలయానికి పనులు ప్రారంభం కాగా.. తాజాగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు తొలి జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను రైల్వే బోర్డు నియమించింది. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నల్ ఇంజినీర్స్ 1988 బ్యాచ్కు చెందిన ఆయన గతంలో రైల్వే బోర్డులో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పని చేశారు. కాగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా పోస్టింగ్ పొందిన సందీప్ మాథుర్ శనివారం దొండపర్తిలో ఉన్న డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్లో బాధ్యతలు స్వీకరించారు. అయితే జీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన సందీప్ మాథుర్ విశాఖ వచ్చి కీలక సమావేశం నిర్వహించడంతో జోన్ పనులు కూతపెట్టినట్లేనని విస్తృతంగా చర్చ మొదలైంది.
విశాఖ కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్తా రైల్వే తొలి జనరల్ మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన సందీప్ మాథుర్ తొలిసారిగా విశాఖ వచ్చారు. కుటుంబ సమేతంగా సింహాచలం వరహాలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి స్వాగతం పలికారు. స్వామివారి వారి దర్శనం అనంతరం వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం నుంచి స్వామి వారి శేష వస్త్రంతో జీఎం మాథుర్ను సత్కరించారు.
స్వామి వారి దర్శనం తర్వాత ఆయన అక్కడి నుంచి వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వాల్తేరు డివిజన్ రైల్వే డీఆర్ఎం లలిత్ బోహారా, సౌత్ పోస్ట్ రైల్వేజోన్ ఓ ఎస్ డీ చంద్రశేఖర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. కాగా నూతన జీఎం త్వరలోనే జోన్కు చెందిన మిగతా డివిజన్లను కూడా సందర్శించే అవకాశం ఉందిని తెలుస్తోంది. జీఎం విశాఖ రాకతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఊపందుకోనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..