కర్ణాటకలో కాంగ్రెస్ అగ్రనేతల ఇళ్లలో ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి. బళ్లారి ఎంపీ తుకారాం, బళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గణేశ్, బళ్లారి రూరల్ ఎమ్మెల్యే బీ నాగేంద్ర ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. వాల్మీకీ కార్పొరేషన్ స్కాంలో ఈడీ సోదాలు చేసింది. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహించారని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటక మహార్షి వాల్మీకీ ఎస్టీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అకౌంట్ల నుంచి కోట్ల నిధులను అక్రమంగా ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటక పోలీసులు, సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు.
వాల్మీకి ఎస్టీ కార్పొరేషన్ను 2006లో ప్రారంభించారు. ఎస్టీ వర్గీయులను సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆ సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. వాల్మీకి నిధుల్ని బెల్లారీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల కోసం వాడుకున్నట్లు ఈడీ ఆరోపణ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిధులు దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు మోపింది. మరోపక్క తమ పార్టీ నేతల ఇళ్లలో ఈడీ సోదాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, కాని రాజకీయ కక్షతో ఈ సోదాలు చేస్తున్నారని సిద్దరామయ్య విమర్శించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈడీ దాడులను పూర్తిగా సమర్ధిస్తున్నారు. వాల్మీకీ కార్పొరేషన్ స్కాంలో భారీగా నిధులు చేతులు మారాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం అక్రమంగా నిధులను దారిమళ్లించారని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..