బెంగళూరు మహదేవపుర ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. త్రిపర్ణ పైక్ అనే బెంగాలీ మహిళ తన అపార్ట్మెంట్లో పెంపుడు కుక్కను హతమార్చింది. దాని రక్తంతో క్షుద్ర పూజలు నిర్వహించినట్లు సమాచారం. స్థానికంగా సంచలనం రేపిన ఈఘటనపై పోలీసుల విచారణ సాగుతోంది.
త్రిపర్ణ పైక్ నాలుగు రోజుల కిందట తన అపార్ట్మెంట్లో క్షుద్రపూజలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు తాను పెంచుతున్న ఒక లేబ్రడార్ కుక్క గొంతు కోసి, దాని శరీరాన్ని గుడ్డలో చుట్టి శ్రీ యంత్ర రేఖాచిత్రంతో పూజలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన చిన్నప్ప లేఅవుట్లోని అపార్ట్మెంట్లో జరిగింది. కుక్క కళేబరంతో గత నాలుగురోజులుగా ఇంట్లో ఉంది త్రిపర్ణపైక్. అపార్ట్మెంట్లో దేవతల చిత్రాలు, ఆరాధన వస్తువులు లభించాయి, స్థానికులు ఆమె అపార్ట్మెంట్ నుంచి దుర్వాసన రావడంతో BBMPకి సమాచారం అందించారు. అధికారులు, వెటరనరీ డాక్టర్ రుద్రేష్ కుమార్తో కలిసి, అపార్ట్మెంట్ను తనిఖీ చేసి ఒక కుక్క శవం, రెండు నీరసంగా ఉన్న కుక్కలను కనుగొన్నారు. రెండు కుక్కలను BBMP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
మహదేవపుర పోలీసులు త్రిపర్ణ పైక్పై జంతు హింస నిరోధక చట్టం కింద కేసుఫైల్ చేశారు. ఆమె తాంత్రిక పూజలు ఎందుకు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రాథమిక విచారణలో ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు సహకరించకుండా, ఆత్మహత్య బెదిరింపులు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆటోప్సీ నివేదిక ప్రకారం, గొంతు కోయడం , పక్కటెముకలు విరగడం వల్ల కుక్క చనిపోయింది.
కుక్కను చంపి..మళ్లీ బతికించవచ్చన్న ఉద్దేశ్యంతోనే పూజలు చేసినట్లు తెలుస్తోంది. పునర్జన్మం కోసమే పూజలు చేసినట్లు పోలీసులకు కూడా త్రిపర్ణ చెప్పినట్లు సమాచారం. ఆమె గతంలో నాలుగు కుక్కలను పెంచినట్లు, ఒకటి నాలుగు నెలల కిందట చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు కుక్కను అత్యంత దారుణంగా చంపిన త్రిపర్ణను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..