అహ్మదాబాద్, జూన్ 13: ఆహ్మదాబాద్లో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ముగ్గురు పిల్లలు మిరాయ, నకుల్, ప్రద్యుత్ మృతి చెందారు. వీరిని రాజస్థాన్లో బన్స్వారాకు చెందిన వారిగా గుర్తించారు.
ప్రతీక్ జోషి, అతని భార్య కోమి వ్యాస్, వారి కవల కుమారులు ప్రద్యుత్, నకుల్, పెద్ద కుమార్తె మిరాయగా గుర్తించారు. ప్రమాదానికి ముందు ప్రతీక్ జోషి కుటుంబం విమానంలో తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో ఆనందంగా కుంటుంబంతో లండన్ వెళ్తున్న ప్రతీక్ జోషి.. అక్కడే ఫ్యామిలీతో ఉండాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇక భార్య కోమి వ్యాస్ తన డాక్టర్ ఉద్యోగాన్ని కూడా వదులుకుని పిల్లలు, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోటి ఆశలతో కుటుంబంతో లండన్ బయల్దేరింది. కాని తానొకటి తలిస్తే దైవం మరోకటి తలచినట్లు విమాన ప్రమాదం మొత్తం కుటుంబాన్న బలి తీసుకుంది. ఈ హృదయ విదాకర ఘటన ప్రతి ఒక్కరినీ కంటనీరు పెట్టిస్తుంది.
విమాన ప్రమాద మృతుల్లో రాజస్తాన్ కు చెందిన వారు మొత్తం10 మంది ఉన్నారు. వారిలో ఐదుగురు ప్రతీక్ జోషి కుటుంబానికి చెందిన వారే కావడం బాధాకరం. ప్రతీక్ జోషి గత ఆరేళ్లుగా లండన్లో ఉంటున్నారు. అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆయన ఇండియాలోని భార్య, పిల్లలను లండన్ తీసుకెళ్లి అక్కడ స్థిరపడాలని కలలు కన్నాడు. కానీ ఊహించని ప్రమాదంతో ఆ కుటుంబం ఆశలన్నీ కరిగిపోయాయి. వారి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఐదేళ్ల కవలలు. పెద్ద కుమార్తె మిరాయకు తొమ్మిదేళ్లు.
ఇవి కూడా చదవండి
ఏఐ171 విమానంలో ప్రయాణించిన 242 మందిలో 241 మంది మృతి చెందినట్లు ప్రకటించింది. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో భారతీయులు 169 మంది, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. ఒకేఒక్క భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. విమానం ఓ మెడికల్ హాస్టల్పై పడటంతో 25 మంది మెడికోలు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది. అహ్మదాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన నిమిషాల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.