చిత్తూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 22 మంది గాయపడ్డారు. చిత్తూరు సమీపం లోని గంగాసాగరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒక వైపు చిత్తూరు తచ్చూరు హైవే నిర్మాణం, మరోవైపు బెంగళూరు చెన్నై హైవే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన టిప్పర్ను మట్టి తరలిస్తూ ప్రమాదానికి కారణమైంది.
తిరుపతి నుంచి తిరుచ్చి వైపు వస్తున్న శ్రీరంగనాథ ట్రావెల్స్ స్లీపర్ బస్సును వేగంగా టిప్పర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మట్టితో రోడ్డు ఎక్కుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ను వెనక వైపు టైరు భాగంలో ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో తిరుచ్చికి చెందినబస్సులోని ఇద్దరు డ్రైవర్ల తోపాటు 28 మంది ప్రయాణికులు గాయపడ్డారు.అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులందరూ గాయపడ్డారు.
విషయం తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సీఎంసీ వేలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురిలో ఒకరు తిరుపతికి చెందిన పొన్ను చంద్రు, మరొకరు కన్యాకుమారికి చెందిన జీవన్ గా గుర్తించిన పోలీసులు మరో ఇద్దరి వివరాల కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గురైన ట్రావెల్స్ బస్ డ్రైవర్ ను విచారిస్తుండగా టిప్పర్ డ్రైవర్ పరార్ అయ్యారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..