ఉరుకులు పరుగుల ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ (మధుమేహం) కేసుల సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది మధుమేహం బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో కూడా మధుమేహం కేసుల సంఖ్య పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కావున.. మధుమేహంపై అవగాహనతో ఉండాలని, నియంత్రణపై దృష్టిపెట్టాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలు పెరగడం వల్ల డయాబెటిస్ వస్తుంది. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే, అది ప్రమాదకరంగా మారుతుందంటున్నారు.
డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, కంటి సమస్యలు వంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అయితే.. కొన్ని ఇంటి నివారణ చిట్లాలతో డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు.. ఇవి మధుమేహాన్ని నియంత్రించడానికి దివ్యౌషధంగా పనిచేస్తాయి. అటువంటి వాటిలో మెంతులు ఒకటి.. మెంతుల్లో అనేక ఔషధ గుణాలు దాగున్నాయి.. మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరం లాంటివని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెంతి టీ లేదా మెంతి నీరు తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని.. ఇది పవర్ ఫుల్ ఔషధమని చెబుతున్నారు.
మెంతుల్లో ఎన్నో పోషకాలు: మెంతులు లేదా మెంతి కూరలో సోడియం, జింక్, భాస్వరం, ఫోలిక్ ఆమ్లం, ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు ఎ, బి, సి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా, ఫైబర్, ప్రోటీన్, స్టార్చ్, చక్కెర, ఫాస్పోరిక్ ఆమ్లం వంటి పోషకాలు కూడా కనిపిస్తాయి.. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంతోపాటు షుగర్ రోగులు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ మెంతి నీటిని తీసుకోవడం ద్వారా చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. మెంతులు ప్రోబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీని వినియోగం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచి.. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటంతోపాటు బరువు కూడా తగ్గుతుంది..
మెంతి నీరు – మెంతి టీని ఇలా తయారు చేసుకోండి: మెంతి నీరు.. మెంతి టీని తయారు చేసుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ముందుగా మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. తర్వాత ఆ నీటిని వడకట్టి మరుసటి రోజు ఉదయం త్రాగాలి. మెంతి కోసం, మీరు మెంతులను నీటిలో మరిగించి, దానికి నిమ్మరసం కలిపి త్రాగవచ్చు. ఈ మెంతి టీ లేదా మెంతి నీటిని ఉదయం పరగడుపున తాగడం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.