పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో నిర్వహించిన భూ భారతి రెవిన్యూ అవగాహన సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కొత్తగా భూ భారతిని తీసుకొచ్చిందని ఆయన అన్నారు. సర్వే నెంబర్లు తెలియజేసేలా భూములకు భూదార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి అన్నారు. అధికారులు నేరుగా గ్రామాల్లోని రైతుల వద్దకే వచ్చి మీ భూ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవిన్యూ అధికారులు పని చేయాలని ఆయన సూచించారు.
నిరుపేదలకు గూడు కలిపించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందని..రానున్న రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లును కట్టిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన తెలిపారు.
భూ భారతి దేశానికే ఆదర్శం..
ఇక రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేసిందని శ్రీధర్ బాబు అన్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఆయన వివరించారు. ఆర్ధిక వ్యవస్థ సరిగ్గా లేకపోయిన.. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంక్షేమ పథకాలను మాత్రం ఎక్కడా ఆపడం లేదన్నారు. పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులు పని చేయాలనన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని స్థానంలో భూభారతీ రెవిన్యూ చట్టాన్ని తీసుకొచ్చామని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..