పురాణాలు, పునర్జన్మలు.. మనకే కాదు, బౌద్ధులకు కూడా ఉన్నాయి. తాజాగా టిబెట్ బౌద్ధ గురువు దలైలామా ఓ సంచలన ప్రకటన చేశారు. తన వారసుడు చైనా బయటే జన్మిస్తాడని దలైలామా పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన తాజా పుస్తకంలో ప్రస్తావించారు. ఆరు దశాబ్దాలకు పైగా టిబెట్.. చైనా ఆక్రమణలో ఉంది. చైనాతో దలైలామాకు వివాదం ఉన్న విషయం తెలిసిందే. తన తర్వాత దలైలామా వారసత్వం కొనసాగాలని ఆయన రాసిన వాయిస్ ఫర్ ది వాయిస్లెస్ పుస్తకంలో కోరారు.
గతంలో ఓ సందర్భంలో దలైలామా మాట్లాడుతూ తన తర్వాత, లామా పరంపర ముగిసిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ, తాజా పుస్తకంలో మాత్రం చైనా బయట కొత్త దలైలామా పుడతారని పేర్కొన్నారు. తన పునర్జన్మ టిబెట్ బయట జరగొచ్చని.. అది భారత్లో కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు. పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తారు. తన బాధ్యత అయిన విశ్వకరుణకు గొంతుకగా ఉంటారు అని ఆ పుస్తకంలో బౌద్ధ గురువు పేర్కొన్నారు.
14వ దలైలామాగా మారిన టెంజియన్ గ్యాట్సో 23వ ఏటే టిబెట్ నుంచి భారత్కు వలస వచ్చారు. 1950లో తమ ప్రాంతాన్ని ఆక్రమించిన చైనాకు వ్యతిరేకంగా ఆయన గళం విప్పారు. టిబెట్ వాదాన్ని సజీవంగా ఉంచినందుకు ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని దలైలామా ఆ పుస్తకంలో వెల్లడించారు.
దలైలామా ప్రస్తుతం భారత్లోని ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు. ఇది చైనాకు గిట్టక తన గడ్డపైనే వారసుడిని గుర్తించాలంటోంది. టిబెటన్ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాత రెండో స్థానం పాంచెన్ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని కాదని, చైనా తానే ఒక బాలుడిని నియమించినా, టిబెటన్ల ఆమోదం పొందడంలో అతడు విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దలైలామా కొత్త వారసుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..