ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఇప్పటివరకూ ఒకలెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క అంటుంది చంద్రబాబు ప్రభుత్వం. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడమే ఆలస్యం.. నిర్మాణ పనులను జెట్ స్పీడ్తో ప్రారంభించి పూర్తి చేయాలని డిసైడ్ అయింది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మొత్తం 100 పనులను 77 వేల 249కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. ఈ ఒక్కరోజే 49 వేల 40కోట్ల రూపాయల పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుడుతున్నారు.
అమరావతిని స్వయం సమృద్ధి నగరంగా నిర్మించాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన. అందుకు అనుగుణంగా 8 వేల 603 చదరపు కిలోమీటర్ల పరిధిని రాజధాని ప్రాంతంగా గుర్తించారు. అందులో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని నగరం నిర్మితమవుతుంది. 16.9 చ.కి.మీ. పరిధిలో కోర్ క్యాపిటల్ను డిజైన్ చేశారు. విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్, నీటి వసతి, బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్తో ఆహ్లాదకరమైన ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వం, న్యాయ, వైద్యం, పర్యాటకం, నాలెడ్జ్ ఫైనాన్స్, స్పోర్ట్స్, మీడియా, టూరిజం వంటి 9 కార్యకలాపాలపై దృష్టి సారించి 9 థీమ్ల్లో 9 నగరాలు ప్లాన్ చేశారు.
ప్రపంచ ప్రఖ్యాత డిజైనింగ్ సంస్థ నార్మన్ పోస్టర్తో ముఖ్య కార్యాలయాల డిజైన్లు చేయించారు. రాజధాని ప్రాంతంలో 30 శాతం పచ్చదనానికి, జలవనరులకు కేటాయించారు. ఐఆర్ఆర్, ఓఆర్ఆర్తో పాటు ఏడు జాతీయ రహదారులు అమరావతి అనుసంధానమయ్యేలా రూపకల్పన చేశారు. 3 వేల 300 కి.మీ. మేర సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయనున్నారు. 131 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు 1,277 ఎకరాలు కేటాయించారు.
రాజధాని అమరావతి కోసం 29 వేల 373 మంది రైతులు 34 వేల 281 ఎకరాలను భూసమీకరణ ద్వారా అందించారు. భూసమీకరణ ద్వారా 34 వేల 281 ఎకరాలు, భూసేకరణ ద్వారా 4 వేల 300 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ, అటవీ, కొండ, ఇతర భూములు15 వేల 167 ఎకరాలు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుని మొత్తం 54 వేల ఎకరాలు రాజధాని కోసం సమకూరింది. రాజధాని అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దేందుకు మొత్తం 11 కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. రాజధానిలో 75 వేల కోట్ల పనులు చేపట్టాలని నిర్ణయించగా.. ప్రస్తుతానికి 49 వేల కోట్ల వ్యయంతో పనులు చేయడానికి టెండర్లు పిలిచారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాజధాని అమరావతి నిర్మాణ పనులు చేయడానికి కాంట్రాక్టు సంస్థలన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. ఐకానిక్ భవనాలుగా అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లను మూడేళ్లలో ఇతర ప్రాజెక్టులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
అమరావతి రాజధాని నేలపాడులో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు తిరిగి పురుడు పోసుకుంటోంది. 856 కోట్ల రూపాయల వ్యయంతో తొలి రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో జీ+18 అంతస్తులతో కూడిన 12 టవర్లను నిర్మించబోతున్నారు. మొత్తం 1200 అపార్ట్మెంట్లు ఉంటాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల నివాసాల కోసం భారీ బహుళ అంతస్తుల భవన సముదాయాల నిర్మాణాల బ్యాలెన్స్ పనులను 452 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియాలో రూ. 419 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 1 విధానంలో మొత్తం 71 బంగ్లాల బ్యాలెన్స్ పనులు చేపట్టనున్నారు.
అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన రూ. 617 కోట్లతో ఐకానిక్ అసెంబ్లీ భవన నిర్మాణం చేపడుతున్నారు. బేస్మెంట్+గ్రౌండ్+3 ఫ్లోర్లతో ఈ భవనం నిర్మిస్తున్నారు. రాజధానిలో తాత్కాలిక హైకోర్టు స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ప్రపంచస్థాయి ఐకానిక్ హైకోర్టు భవనాన్ని 786 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు నివాస, కమర్షియల్ రిటర్నబుల్ ప్లాట్లను ప్రభుత్వం అందిస్తోంది. వివిధ జోన్లలో దాదాపు 15 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఎల్పీఎస్ ఇన్ర్ఫా పనులు చేపడుతోంది.
రాష్ర్టానికే ప్రధాన పరిపాలన కేంద్రమైన సచివాలయం కోసం జీ ప్లస్ 40 విధానంలో 4 వేల 668 కోట్ల రూపాయల వ్యయంతో ఐకానిక్ సచివాలయ టవర్ల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్లు పిలిచింది. మొత్తం 5 టవర్లను డయాగ్రిడ్ విధానంలో చేపడుతున్నారు. రాజధానిలో వరద సమస్యను శాశ్వతంగా నివారించటానికి వీలుగా 5 వేల 944 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 13 ప్యాకేజీలలో పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రాజధానిలో రోడ్లు, కేబుల్స్ రహిత డక్ట్స్, సైకిల్ ట్రాక్స్కు సంబంధించిన పునరుద్ధరణ పనులను 9 వేల150 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్నారు.