నర్సన్న భక్తులకు గుడ్‌న్యూస్.. ఆగుతూ.. సాగుతున్న యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సేవలకు మోక్షం..!

నర్సన్న భక్తులకు గుడ్‌న్యూస్.. ఆగుతూ.. సాగుతున్న యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సేవలకు మోక్షం..!


యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు గుడ్ న్యూస్. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వరకు ఎంఎంటీఎస్ ట్రైన్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎంఎంటీఎస్ సేవలకు సంబంధించి రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందించారు. దశాబ్దాల నుంచి ఆగుతూ.. సాగుతున్న యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు సేవలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్లాది రూపాయలతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం ప్రారంభమైన తర్వాత యాదగిరిగుట్టకు భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారం, సెలవు దినాల్లో 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. అయితే యాదగిరి గుట్టకు ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది భక్తులు ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ, సొంత వాహనాల్లోనూ వస్తున్నారు. దీంతో యాదగిరి గుట్టకు ప్రయాణ వసతులను కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు. 2004 నుంచి 2016 వరకు సీఎం లందరూ ఎంఎంటీఎస్ పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ నిధులు లేక పట్టాలెక్కలేదు.

యాదగిరి గుట్ట భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకొని ఎంఎంటీఎస్ మూడోదశ సేవలను ప్రారంభించాలని, అవసరమైన స్థల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ సేవలను పొడిగింపును చేపట్టేలా 2023లో కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.330 కోట్ల నుంచి రూ. 464 కోట్ల వరకు పెరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకూ ఎంఎంటీఎస్‌ రెండో దశ కింద 21కిలోమీటర్ల రైల్వే లైను పూర్తి అయ్యింది. ఘట్కేసర్-యాదాద్రి మధ్య 33 కి.మీల మేర మూడో రైల్వేలైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంపై ఆశలు చిగురించాయి. అమృతా భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఘట్కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ విస్తరణకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, జూన్ లో ప్రాథమిక పనులు ప్రారంభం కానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

సికింద్రాబాద్ నుండి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు అందుబాటులోకి వస్తే ఒకరికి రూ. 20 మాత్రమే చెల్లించి సికింద్రాబాద్ నుంచి కేవలం 45 నిమిషాల నుంచి గంట వ్యవధిలో గమ్యం చేరుకునే అవకాశముంది. ఎంఎంటీఎస్‌ సేవల పొడిగింపునకు కేంద్రం ముందుకు రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ మూడో దశ పొడిగింపుతో స్వామివారి దర్శనానికి డబ్బు, సమయం ఆదా అవుతుందని భక్తులు చెబుతున్నారు. యాదాద్రి రైల్వే స్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *