
మధ్యప్రదేశ్లో అందరూ ఆశ్చర్యపోయే భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల హయాంలో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం మూడో ముఖ్యమంత్రి హయాంలో బయటపడింది. కమల్నాథ్, శివరాజ్సింగ్ చౌహాన్ ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి పరులను ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ ఇప్పటి సీఎం మోహన్ యాదవ్ పాలనలో ఈ దందా బయటపడింది. ఔరా అని అంతా అవాక్కయ్యేలా చేసింది.
ప్రభుత్వ ఉద్యోగం చేసే ఉన్నతాధికారులు తలుచుకోవాలే గానీ సర్కార్ ఖజానాకు గండి కొట్టాలంటే చిటికెలో పని..! అంతా వారి చేతిలోనే ఉంటుంది. నష్టపరిహారం కోరేది వాళ్లే .. ప్రభుత్వం నుంచి లబ్ది పొందేది వాళ్లే.. అయితే ఎవరో కొందరు అమాయకుల పేర్ల మీద ఈ తతంగం అంతా నడిపిస్తుంటారు. మధ్యప్రదేశ్లో బయటపడిన కుంభకోణం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
మధ్యప్రదేశ్లోని సివ్ని జిల్లాలో 11 కోట్ల 26 లక్షల సర్ప దంశ కుంభకోణం వెలుగు చూసింది. పాము కాటు వల్ల ఎవరైనా మరణిస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వం 4 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తోంది. దీన్నే అదనుగా భావించిన కొందరు అధికారులు అక్రమ వసూళ్లకు తెరతీశారు. ఒకే వ్యక్తి పేరు మీద 30 సార్లు నష్టపరిహారం వసూలు చేశారు. రమేష్ అనే వ్యక్తి పాము కాటుతో మరణించాడని 30 సార్లు వేర్వేరు డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం తీసుకున్నారు. ఏకంగా ఒక కోటి 20 లక్షల రూపాయల లబ్ది పొందారు. రామ్కుమార్ అనే మరో వ్యక్తి మృతి చెందాడని 19 సార్లు 38 నకిలీ పత్రాలు సృష్టించి 81 లక్షల కాజేశారు.
ఇలా మొత్తం 47 మంది మృతుల పేర్లపై నకిలీ డెత్ సర్టిఫికెట్స్ సృష్టించి నష్ట పరిహారం పొందారు. ఈ కుంభకోణం వెనుక ఒక SDM, నలుగురు తహసిల్దార్లు, మూడవ స్థాయి ఉద్యోగులు కలిపి ఓ 46 మంది వరకు ఉన్నట్టు గుర్తించారు. 2019 నుంచి 2022 వరకు ఈ కుంభకోణం ఎవరికీ అనుమానం రాకుండా కొనసాగింది. 2020-2022 మధ్య మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్పదంశ నరిహారంగా 231 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ రెండు సంవత్సరాల్లోనే 5 వేల మందికి పైగా మరణించారు.
మధ్యప్రదేశ్లోని సివ్ని జిల్లాలో ఉన్న అసిస్టెంట్ గ్రేడ్ 3 ఉద్యోగి సచిన్ దహాయక్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోశించాడని పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మరో 46 మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అప్పటి SDM అమిత్సింగ్తో పాటు ఐదుగురు తహసిల్దార్లు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారు. కొన్నిసార్లు డెత్ సర్టిఫికెట్, పోలీస్ ధృవీకరణ, పోస్ట్మార్టమ్ రిపోర్ట్ లేకుండానే నష్టపరిహారం బిల్లులు ఆమోదించినట్టు ఆర్థికశాఖ ప్రత్యేక బృందం చేపట్టిన విచారణలో వెల్లడైంది. లబ్దిదారుల ఖాతాలకు వెళ్లాల్సిన డబ్బులను ప్రధాన నిందితుడు తన కుటుంబ సభ్యులు, స్నేహితుల ఖాతాలకు మళ్లించినట్టు విచారణలో బయటపడింది. ఈ కేసులో సచిన్ దహాయక్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
పాము కాటు నష్టపరిహారానికి సంబంధించిన కుంభకోణంలో నిందితులను గుర్తించామని విచారణ అధికారి రోహిత్ కౌశల్ తెలిపారు. 11 కోట్ల 26 లక్షల కుంభకోణంలో విచారణ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన నివేదికను సివ్ని కలెక్టర్కు సమర్పించామని విచారణ అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..