విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. చీపురుపల్లి నూతన రైల్వే బ్రిడ్జి సమీపంలో వారణాసి సురేష్ అనే వ్యక్తి ఇంట్లో దోపిడి దొంగలు భీభత్సం సృష్టించారు. వారణాసి సురేష్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు సరస్వతీ పుష్కరాల కోసం రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయల్దేరి వెళ్లారు. అయితే అనారోగ్య కారణాలతో పుష్కరాలకు వెళ్లలేక వారణాసి సురేష్ కుటుంబసభ్యుల్లో ఇద్దరు వృద్ధ మహిళలు ఇంటి వద్దే ఉండిపోయారు. ఈ క్రమంలోనే మే 23 రాత్రి పది గంటలకు ఇంట్లో భోజనం చేసి నిద్రపోయారు ఇద్దరు మహిళలు. అదే రోజు రాత్రి సుమారు 1:30 గంటల ప్రాంతంలో దోపిడి దొంగలు ఇంటి పై ఫ్లోర్ లో ఉన్న తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. దొంగలు రావడం గమనించిన మహిళలు వారి బారిన పడకుండా ఉండేందుకు పక్క గదిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు.
అలా వెళ్తున్న మహిళలను చూసిన దొంగలు వారి మెడలో ఉన్న బంగారాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఇద్దరు మహిళలు అందుకు ససేమిరా అని వారించి ప్రతిఘటించారు. దీంతో పట్టరాని కోపంతో దొంగలు ఇద్దరు మహిళల పై తమ వద్ద ఉన్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారంతో పాటు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం తీసుకొని పరారయ్యారు. దొంగలు ఎత్తుకెళ్లిన బంగారాం మొత్తం 20 లక్షల వరకు ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు.
అయితే దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధులు రక్తపు మడుగులోనే అపస్మారక స్థితిలో పడిపోయారు. అలా తెల్లారేవరకు రక్తపు మడుగులోనే ఉన్నారు. తెల్లారిన తరువాత ఎప్పటిలాగే ఇంట్లోకి పాలు పోసేందుకు వచ్చిన యువకుడు వారిని పిలిచే ప్రయత్నం చేశాడు.. ఎంత పిలిచినా ఎవరూ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుండి చూడగా ఇద్దరు మహిళలు రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే ఆ యువకుడు స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలించారు. ఇద్దరు మహిళలను చీపురుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అప్పటికే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్ కు తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న తీర్థయాత్రలో ఉన్న వృద్ధుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఇంటికి బయలుదేరారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..