Hyderabad: వివాహ బంధాలు, భార్యాభర్తల అనుబంధాలు నానాటికీ ఇక పూర్తిగా కనిపించకుండా పోతాయేమో.. పెళ్లి, కట్టుబాట్లకు ఉన్న విలువను ప్రస్తుత సమాజం దాదాపుగా మర్చిపోతుంది. మొన్నటికి మొన్న మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హనీమూన్ పేరుతో తీసుకెళ్లి భర్తను అతి కిరాతకంగా చంపించేసింది ఓ యువతి. ఈ దారుణం గురించి ఇంకా మర్చిపోక ముందే దేశంలో ఎక్కడో ఓ చోట వివాహ బంధాన్ని ఎగతాళి చేసేలా ఇలాంటి ఘటనలు ఇంకా ఇంకా ఎదురవుతూనే ఉన్నాయి. ప్రేమించిన వాడి కోసం ఏకంగా భర్తపైనే హత్యాయత్నం చేయించింది ఓ ప్రబుద్దురాలు. ఇలాంటివి వింటుంటే రేపటి రోజు తాము పెళ్లి చేసుకోవడానికే భయంగా ఉందంటూ యువత వాపోతుంది. తాజాగా జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రశాంతంగా నిద్రపోతున్న నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్-అసిఫ్ నగర్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుని చివరికి వివాహ బంధంతో ఒక్కటయ్యారు ఓ జంట. హుసామ అనే యువకుడు శాయిస్తా అనే యువతి ఇష్టపూర్వకంగా పెద్దల్ని ఒప్పించి మరీ వివాహం చేసుకున్నారు. తమ తొమ్మిదేళ్ల ప్రేమ బంధాన్ని పెళ్లితో మరింత ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో.. ప్రశాంతంగా సాగుతున్న వీరి జీవితంలోకి అమీర్ అనే యువకుడు ప్రవేశించాడు. ఆ పరిచయం కాస్తా ఓ నిండు సంసారంలో చిచ్చు పెట్టింది. ఈ అమీర్ అనే యువకుడితో శాయిస్తా మరోసారి ప్రేమలో పడింది. యువకుడితో తన భార్య చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతుండగా భర్త చూసి షాకయ్యాడు. ఇదే విషయమై భార్యను హుసామ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఆ భార్యాభర్తలిద్దరికీ ఎన్నో సార్లు గొడవలు కూడా వచ్చాయి.
ఇంకేముంది.. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఆ యువతి ప్లాన్ వేసింది. ఉన్నట్లుండి తాను విదేశాలకు వెళ్లిపోతున్నానని భర్త హుసామతో చెప్పింది శాయిస్తా. అతనిని నమ్మించేలా చేసి మరోవైపు అమీర్ ప్రేమలో మునిగితేలుతూ కాలక్షేపం చేసింది. అటువైపు, అమీర్ కూడా భర్తకు విడాకులు ఇవ్వాలని పదేపదే శాయిస్తాపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఇక ఎలాగైనా తమ ప్రేమకు భర్త అడ్డును తొలగించుకోవాలని, ఆపై అమీర్తో సంతోషంగా ఉండొచ్చని భావించింది. ఈ విషయమై ముగ్గురి మధ్య గొడవలు తీవ్రతరం అయ్యాయి. అది కాస్తా.. నా భార్య అని భర్త వాదిస్తుంటే, లేదు నా ప్రియురాలు అంటూ ఆ ప్రేమికుడు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకునే వరకూ వచ్చింది. దీంతో భార్య హుసామ ఆసిఫ్నగర్ పోలీసులను ఆశ్రయించాడు.
తన భార్య ప్రేమించిన వాడి కోసం తనపై హత్యాయత్నం చేయించిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. త్వరలోనే విదేశాలకి వెళ్లిపోతున్నానంటూ చెప్పి ప్రియుడితో తన భార్య తిరిగిందని, పలుమార్లు హెచ్చరించినా తన భార్య వినలేదని వాపోయాడు. అందుకే కక్ష పెంచుకుని ప్రియుడి కోసం తనపై హత్యాయత్నం చేయించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హుసామ ఫిర్యాదు మేరకు ఆసిఫ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..