
పాకిస్తాన్లోని పెషావర్లో ఆదివారం(మే 11) సాయంత్రం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. పెషావర్ రింగ్ రోడ్డులో పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. పోలీసు మొబైల్ దగ్గర ఈ దాడి జరిగిందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
పెషావర్ రింగ్ రోడ్డులోని పోలీసు మొబైల్ దగ్గర ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. భద్రతా దళాలు దర్యాప్తు నిర్వహిస్తున్నాయి. ‘ఈ పేలుడులో సబ్-ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు’ అని పెషావర్ క్యాపిటల్ సిటీ పోలీస్ ఆఫీసర్ (CCPO) ఖాసిం ఖాన్ అన్నారు.
పాకిస్తాన్ మీడియా ప్రకారం, ఆత్మాహుతి దాడిలో పోలీసు మొబైల్ లక్ష్యంగా జరిగిందని CCPO ఖాసిం ఖాన్ తెలిపారు. ఈ దాడి రింగ్ రోడ్ మాల్ మండి ప్రాంతానికి సమీపంలో జరిగింది. ఇటీవలి కాలంలో, నగరంలో పోలీసులను లక్ష్యంగా చేసుకున్న ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున, గ్వాదర్లోని ఒక మసీదు సమీపంలో హ్యాండ్ గ్రెనేడ్ విసిరిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక పోలీసు మృతి చెందాడు.దాడి చేసిన దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
గ్వాదర్లోని ఒక మసీదు సమీపంలో దాడి చేసిన వారికి, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. గ్వాదర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) జియా మండోఖైల్ ప్రకారం, సయ్యద్ హష్మీ అవెన్యూలోని బిలాల్ మసీదు సమీపంలోని నివాస ప్రాంతాన్ని దుండగులు గ్రెనేడ్లతో దాడి చేయాలని లక్ష్యంగా చేసుకున్నారు. దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో ఒక దుండగుడు మృతి చెందగా, మరొకరు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్ మరణించాడు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..