జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏ క్షణమైనా భారత ఆర్మీ పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయొచ్చు, లేదా రెండు దేశాల మధ్య యుద్ధ రావొచ్చు అనే విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి. 26 మంది భారత పౌరుల మరణానికి కారణమైన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. వారి వెనకున్న వారికి కూడా వదిలిపెట్టమంటూ ఇప్పటికే ప్రధాని మోదీ పలు సార్లు తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేశారు.
సింధు జలాల నిలిపివేత, పాక్ పౌరులకు వీసాల రద్దు, సరిహద్దుల మూసివేత, దిగుమతుల నిలిపివేత వంటి చర్యలతో ఇప్పటికే పాకిస్థాన్పై కఠిన వైఖరి అవలంభిస్తోంది భారత్ ప్రభుత్వం. మరోవైపు భారత్పై కూడా పాకిస్థాన్ పలు ఆంక్షలు విధించింది. ఇరుదేశాలు సరిహద్దుల వద్ద భారీగా సైన్యాన్ని మోహరించడం, యుద్ధ సామాగ్రిని తరలిస్తూ.. యుద్ధం తప్పదనే సంకేతాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాపై కచ్చితంగా అణుబాంబు దాడి చేస్తామంటూ పాకిస్థాన్ అంబాసిడర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా ఇండియాను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగించారు. అది కూడా రష్యా దేశంలో కూర్చోని ఆయన మాట్లాడారు.
భారత్, పాకిస్థాన్లోని కొన్ని చోట్ల దాడులు చేస్తుందనే సమాచారం ఉందని అలా చేస్తే భారత్పై అణుబాంబులతో దాడి చేస్తామని రష్యాలోని పాకిస్థాన్ అంబాసిడర్ మహ్మద్ ఖలీద్ జమాలీ అన్నారు. భారత్ దాడి చేస్తే తాము పూర్తిస్థాయిలో దాడికి దిగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూ.. దీనికి పాకిస్థాన్ ప్రభుత్వం ఏ విధంగా వివరణ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొని ఉన్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సరికావని దౌత్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి