కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. వైరస్ సోకి ఓ యువతి చనిపోగా .. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో అధికారులు మూడు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పబ్లిక్ ఈవెంట్స్పై నిషేధం విధించారు.
కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ అలజడి లం రేపుతోంది. మూడు జిల్లాల్లో పబ్లిక్ ఈవెంట్స్పై నిషేధం విధించారు. ఈ వైరస్ కారణంగా ఓ యువతి ఇప్పటికే చనిపోయింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా బారిన పడి జులై 1న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొట్టక్కల్లోని ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇదే సమయంలో, పాలక్కాడ్కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నిఫా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కేరళ ఆరోగ్య శాఖ వెంటనే రంగంలోకి దిగింది. ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్.. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో హైఅలర్ట్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా, మరణించిన యువతికి చికిత్స అందించిన 43 మంది ఆరోగ్య సిబ్బందిని క్వారంటైన్లో ఉంచారు.
నిఫా అనేది జంతువుల నుంచి, ముఖ్యంగా గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఇది సోకిన వారిలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులతో పాటు మెదడువాపు లేదా తీవ్ర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. దీనికి నిర్దిష్టమైన చికిత్స లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో ఒకటిగా పరిగణిస్తోంది. వైరస్ వ్యాప్తిపై నిఘాను మరింత పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి ఏటా కేరళలో నిఫా వైరస్ కేసులు బయటపడుతున్నాయి. రాష్ట్రం లోని అన్ని ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో కంటేన్మెంట్ జోన్లుగా ప్రకటించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..