
ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఓ ఆప్ ఎమ్మెల్యే తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ మహిళ పట్ల ఆ ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.ఢిల్లీలోని సంగం విహార్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దినేష్ మోహానియా.. తాజాగా మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల తన నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన దినేష్ మోహానియా.. ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు ఆమెను చూస్తూ సైగలు చేసినట్లు బాధితురాలు ఆరోపించారు. ఆ తర్వాత ఆమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో.. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళ.. తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.