యూట్యూబ్లో వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా మందికి తెలుసు. అయితే భారతీయ కంటెంట్ క్రియేటర్లు, యూబ్యూబర్లు ఎన్ని వేల కోట్ల ఆదాయం పొందారో తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం. ముంబైలో జరిగిన వేవ్ 2025 సమ్మిట్లో యూట్యూబ్ CEO నీల్ మోహన్ ఈ విషయం వెల్లడించారు. భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ ఇప్పటివరకు రూ.21,000 కోట్లు చెల్లించిందని, స్థానిక ప్రతిభను ప్రొత్సహించడం, సమర్ధించడంలో యూట్యూబ్ పాత్రను మోహన్ పేర్కొన్నారు.
భారతీయ క్రియేటర్ల వృద్ధిని, ప్రపంచవ్యాప్తంగా వారి పరిధిని మరింత పెంచడానికి రాబోయే రెండు సంవత్సరాలలో అదనంగా రూ.850 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. “భారతదేశంలోని తదుపరి తరం సృష్టికర్తలకు మద్దతు ఇవ్వడానికి యూట్యూబ్ ఇక్కడ ఉంది” అని మోహన్ అన్నారు. కొత్త పెట్టుబడి ప్రతిభకు శిక్షణ ఇవ్వడం, సృజనాత్మకతకు మద్దతు ఇవ్వడం, భారతీయ సృష్టికర్తలు ప్రపంచ ప్రేక్షకులను చేరుకోవడంలో సహాయపడటంపై దృష్టి సారిస్తుందని ఆయన వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో 25 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్న నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కూడా ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య వేగంగా అభివృద్ధి చెందుతోంది. గత సంవత్సరంలో 100 మిలియన్లకు పైగా భారతీయ యూట్యూబ్ ఛానెల్లు కంటెంట్ను ప్రచురించాయి. 1 మిలియన్ కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉన్న ఛానెల్లు 11,000 నుండి 15,000కి పెరిగాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి