దొంగదెబ్బ తీసింది వాడు. దగాపడ్డది, తీవ్రంగా గాయపడ్డది మనం. అమాయకుల ప్రాణాలు తోడుకెళ్లింది వాడు. కడుపు మండాల్సింది మనకు. నెత్తుటి రుచి మరిగి.. కన్నుమిన్నూ గానక మళ్లీమళ్లీ దుస్సాహసానికి తెగించింది వాడు. పోనీలే పక్కింటోడు కదా అని మానవతను చాటుకుంటూ వస్తున్నది మనం. అయినా సరే.. కావరం కరగలేదు వాడికి. మాటలు తూలుతూనే ఉన్నాడు. మరి.. యుద్ధంతోనే బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చేసిందా..?
మనం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపేస్తే.. వాడు సిమ్లా డీల్ను సస్పెన్షన్లో పెట్టాడు. మనం అటారీ చెక్పోస్టును మూసేస్తే.. పాకిస్తానోడు వాఘా సరిహద్దుల్లో గేట్లు తెరవబోనన్నాడు. మనం పాక్ జాతీయుల వీసాలను రద్దు చేస్తే.. వాళ్లు సార్క్ స్కీమ్ కింద మనకి న్యాయబద్ధంగా వచ్చిన వీసాలను కోసిపారేశారు. భారత్లో పాక్ ఎంబసీలను మనం ఖాళీ చేయిస్తే.. వాళ్లు మన డిఫెన్స్ అడ్వయిజర్స్ని వెనక్కి పంపేశారు. అరేబియా సముద్రంలో మనోళ్లు ఐఎన్ఎస్ సూరత్ని దించి సీస్కిమ్మింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహిస్తే.. పాకిస్తాన్ నేవీ కూడా కరాచీ, గ్వాదర్ పోర్టుల్లో అప్రమత్త కవాతు చేసి.. సబ్ మెరైన్లను కూడా ఓవరాలింగ్ చేసుకుని సిద్దం అంటోంది. అక్కడితోనే ఆగలేదు.. తమ గగనతలంలో మన విమానాలకు నో ఎంట్రీ బోర్డే పెట్టేసింది పాకిస్తాన్. వాస్తవాధీన రేఖ దగ్గర పాకిస్తాన్ బలగాలను పెంచుకుంది. ఇలా.. ప్రతీ ఎత్తుగడనూ మన దగ్గర కాపీకొట్టి టిట్ఫర్ టాట్ సౌండే ఇస్తూ వస్తోంది పాకిస్తాన్. భారత్ సత్తాను తెలిసి కూడా ఇంతలా బరితెగిస్తున్నాడంటే.. వాడి గొయ్యి వాడే తీసుకున్నట్టు కాదా..?
అంతెందుకు.. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం అంటే మాతో యుద్ధానికి కాలు దువ్వినట్టే.. అదీ చూస్తాం.. అని పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ పేట్రేగి మాట్లాడేశాడు. తొందరపడి ఏ చిన్న దుస్సాహసం చేసినా దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయి.. అని మరో కూత కూడా కూశాడు. బిడ్డా కాచుకో.. ఇకమీదట నీకు నిద్రలేని రాత్రులే.. అని బీహార్ గడ్డ మీద నుంచి పాకిస్తాన్కు బహిరంగ హెచ్చరికే జారీ చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రెండు దేశాల్లో ఎయిర్ఫోర్స్ వార్గేమ్స్ షురూ చేశాయి. దీన్ని బట్టి ప్రపంచానికైతే ఒక విషయం క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది. రెండు దేశాల మధ్య సరిహద్దులు రగులుతున్నట్టు.. యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు ఓ క్లారిటీ ఐతే వచ్చేసింది.
దారికాచి.. దొంగదెబ్బ తియ్యడంలో వాళ్లే ఫస్ట్. ఆ విధంగా ప్రతీసారీ సూపర్సక్సెస్ కొట్టి రాక్షస నవ్వు నవ్వుకుంటోంది పాకిస్తాన్. కానీ.. మనతో నేరుగా తలపడిన ప్రతీసారి.. అడ్డంగా ఓడిపోయి.. బొక్కబోర్లా పడ్డ దిక్కుమాలిన ట్రాక్ రికార్డ్ కూడా పాకిస్తాన్దే. అన్నిసార్లు తోకముడిచి పారిపోయినా నిస్సిగ్గుగా మళ్లీ ఎదురుగా వచ్చి నిలబడుతోంది. తోక జాడించిన ప్రతిసారీ పాపిస్తాన్కి మన చేతుల్లో పచ్చడి పచ్చడే అయ్యింది. అణ్వస్త్రాల నుంచి అంగబలం దాకా… మనమే బాహుబలి కనుక వార్ వన్సైడే అయ్యింది. 1965 నాటి యుద్ధంలో భారత్-పాక్ రెండు దేశాలూ ఎవరికివాళ్లు విక్టరీని క్లెయిమ్ చేసుకున్నప్పటికీ.. అల్టిమేట్గా దెబ్బతినింది పాకిస్తానే. ఎక్కువ ప్రాంతాన్ని దక్కించుకున్నది మనం. మిలిటరీ సక్సెస్ భారత్దే అని గ్లోబల్ మీడియా అప్పట్లో హెడ్లైన్ వార్తలు రాసింది.
తర్వాత 1971లోనూ భారత్ చేతిలో చితికి బతికిపోయింది పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్కు విముక్తి కల్పించి, బంగ్లాదేశ్కు స్వయంప్రతిపత్తి సాధించి పెట్టి.. జయకేతనం ఎగరేసింది భారత్. 93 వేల మంది పాక్ దళాలు శరణు వేడుకుని లొంగిపోయిన డిసెంబర్ 16ను ఇప్పటికీ విజయ్దివస్గా సెలబ్రేట్ చేసుకుంటోంది హమారా భారత్ మహాన్. 1999లో జరిగిన కార్గిల్ వార్ కూడా వన్సైడే అయ్యింది. పాకిస్తాన్ చొరబాటును సక్సెస్ఫుల్గా తిప్పికొట్టి, బార్డర్ అవతలికి తరిమికొట్టిన మన జవాన్లు.. కార్గిల్ శిఖరం మీద గెలుపు జెండా ఎగరేశారు. భారత్ 500 మంది జవాన్లను కోల్పోయింది. కానీ.. 4వేలమంది పాక్ ఆర్మీని మట్టికరిపించింది. విశాఖకి రహస్యంగా వచ్చిన పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని సైతం తుక్కుతుక్కు చేసి సముద్రంలో ముంచేసింది ఇండియన్ నేవీ. ఇలా.. మనతో తలపడ్డ ప్రతీసారీ పాకిస్తాన్కి చావుదెబ్బ తప్పలేదు.
ఫ్లాష్బ్యాక్లో ఇన్నేసి పీడకలలు వెంటాడుతున్నా రియాలిటీలోకి రాలేకపోతోంది పాకిస్తాన్. కిందపడ్డా తనదే పైచేయి అంటోంది. పహెల్గామ్ పాశవికానికి పరోక్షంగా బాధ్యత వహిస్తూనే.. కనీస పశ్చాత్తాపం లేకపోయింది. పైగా.. మనతో మళ్లీ కయ్యానికే కాలుదువ్వుతోంది. ఈసారి కనుక సైనికచర్యకు పూనుకుంటే.. దాయాది దేశానికి దయ్యం వదిలిపోవడం ఖాయమేగా?
సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని భారతదేశం భరించే పరిస్థితుల్లో లేదు. పాకిస్తాన్తో యుద్ధం చేయడమొక్కటే భారత్కు ఉన్న మార్గం. అయినా.. స్వీయ రక్షణ కోసం యుద్ధం చేయడం తప్పు కాదుగా..? అవసరమైతే మేమూ మద్దతిస్తాం..! దాదాపు పదేళ్ల కిందటే అమెరికా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. నిజానికి మనకంటే పాకిస్తాన్కే అమెరికాతో ఫ్రెండ్షిప్ ఎక్కువ. అటువంటి అమెరికానే మనకు పక్కబలంగా ఉన్నప్పుడు.. మనల్నెవడు ఆపేది..? మన దేశం చేతుల్లో ఉండే చిట్టచివరి.. బలమైన ఆప్షన్ అణుయుద్ధం. దాన్ని కూడా ట్రైచేసే ఆలోచన జరుగుతోంది.
అణు యుద్ధం.. దీని గురించి మాట్లాడుకోవడం.. భయపెట్టడం.. భయపడ్డమే తప్ప ఇంతవరకూ రియాలిటీలో చూసింది లేదు. ఏ దేశానికి ఆ దేశం న్యూక్లియర్ వెపన్స్ కూడబెట్టుకోవడం మీదే దృష్టి పెడుతున్నాయి. అణ్వాయుధాల విషయంలో ప్రస్తుతం ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీ అమల్లో ఉంది. భారత్ మొదటగా తమమీద అణుబాంబు వెయ్యదన్న భరోసాతో ఉంది పాకిస్తాన్. కానీ.. అణ్వాయుధాల విషయంలో భారత్ది ఇప్పుడు అప్పర్ హ్యాండ్. గగనతలం, సముద్రతలం, భూమ్మీద మూడు మార్గాల్లో న్యూక్లియర్ మిస్సైల్స్ను ప్రయోగించగల సత్తా సాధించింది భారత్. నో ఫస్ట్ యూజ్ పాలసీని కనుక మార్చగలిగితే.. పాకిస్తాన్పై భారత్ అణుబాంబులతో యధేచ్ఛగా విరుచుకుపడొచ్చు.
భారత్ ఖాతాలో గరిష్టంగా 180 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. అణ్వస్త్ర దేశాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాం. పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నాయి. కానీ… ఈ ఏడాది ఆ సంఖ్యను 200దాకా పెంచుకున్నట్టు కొన్ని రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ లెక్కన మన దేశానికి సమఉజ్జీగా నిలిచింది పాకిస్తాన్.
ఒక్కో వార్ హెడ్కు ఐదు కిలోల ఫ్లుటోనియం.. లేదా 15 కిలోల హైలీ ఎన్రిచ్డ్ యురేనియం అవసరమవుతుంది. భారత్ దగ్గర సుమారు 600 కిలోల ఫ్లుటోనియం నిల్వ ఉంది. పాక్ దగ్గర 170 కిలోలు మాత్రమే ఉంది. కానీ.. శుద్ధి చేసిన యురేనియం 3.1 టన్నుల మేర నిల్వ ఉంచుకుంది పాకిస్తాన్. పైగా.. ఫ్లుటోనియం విడుదల చేసే రియాక్టర్లు పాకిస్తాన్ దగ్గర నాలుగు ఉంటే. మన దగ్గర ఒక్కటే ఉంది. ఇది పదేళ్ల కిందట అణుశాస్త్రవేత్తలు వేసిన అంచనా.
ఒకవేళ అణుయుద్ధం అనివార్యమైతే నష్టం ఏ స్థాయిలో ఉంటుంది..? రెండు దేశాలూ కలిసి 100 న్యూక్లియర్ వార్ హెడ్లు ప్రయోగించినా 80 బిలియన్ పౌండ్ల దట్టమైన పొగ రిలీజ్ అవుతుంది. దీంతో 13 కోట్ల మంది దాకా చనిపోయే ప్రమాదముంది. ఇది.. రెండో ప్రపంచ యుద్దంలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువ. పాకిస్తాన్ అణుబాంబులు విసరాలి అనుకుంటే.. భారతదేశంలోని నాలుగు మెట్రో సిటీస్తో పాటు జైపూర్, లూథియానా, పుణె, భోపాల్, కోల్కతా, లక్నో, నాగ్పూర్, అహ్మదాబాద్ నగరాలను కూడా టార్గెట్ చేసే అవకాశముంది.
ఇదంతా అటుంచితే.. అణు యుద్ధం జరిగితే ఓజోన్ పొర సగానికి పైగా దెబ్బతింటుంది. రుతుపవనాలు ప్రభావితమై వానలు పడక వ్యవసాయ రంగాన్ని ఛిద్రం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ఆకలితో అలమటిస్తారు. కానీ.. భారత్-పాక్ మధ్య ఇవాళ్టి టెన్షన్లు అణుయుద్ధం దాకా దారితీసే అవకాశాలు చాలాచాలా తక్కువ.
పహల్గామ్లో జరిగింది ముమ్మాటికీ నరమేథమే. కానీ.. పాకిస్తాన్ దుస్సాహసాల జాబితాలో ఇదే చివరిది కావాలి. సీమాంతర తీవ్రవాదానికి దీంతోనే ఫుల్స్టాప్ పడాలి. మరోసారి పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూడకూడదు. కశ్మీర్ గురించి మాట్లాడనే కూడదు. ఒకవేళ సైనికచర్యతోనే పాకిస్తాన్ దారికొస్తుందని భావిస్తే.. ప్రస్తుతానికి భారత్ ముందుండే మల్టిపుల్ ఆప్షన్లు ఏంటి..?
కాల్పుల విరమణ ఒప్పందం రద్దు
2021 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం..! నాలుగేళ్లుగా తమ బలగాలను ఆఫ్ఘన్ సరిహద్దుల్లోనూ, బెలూచిస్తాన్ అంతర్గత తీవ్రవాదంతో కొట్లాడ్డానికి వాడుతోంది పాక్ దేశం. ఇప్పుడు మనతో సీజ్ఫైర్ రద్దయితే పాక్ సైన్యం మొత్తం ఎల్ఓసీ దగ్గరకు రావల్సిందే. ఆ విధంగా పాకిస్తాన్పై సైనికపరంగా ఒత్తిడి పెంచే అవకాశం ఇది.
మిలిటెంట్ బిగ్బాసులను మట్టుబెట్టడం..!
ప్రతీకార చర్యల్లో ఇది చాలా పాత పద్ధతి. మోటు పద్ధతి కూడా. హమస్ చీఫ్ను, హెజ్బుల్లా చీఫ్ను టార్గెట్ చేసి.. చంపి పాతరేసి ఇజ్రాయెల్ ఎలా సక్సెస్ అయ్యిందో.. మనం కూడా లష్కరే తోయిబా, జైషే మొహ్మద్ పెద్దలను హతమార్చి.. మిలిటెంట్ సంస్థలకు నాయకత్వ లేకుండా చేయడం.
రంగంలోకి అత్యాధునిక ఫైటర్ జెట్
ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్లు రఫేల్, మిరాజ్ 2000. వీటిని ఉపయోగించి పాకిస్తాన్లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయడం.. భారత్ ముందుండే ఫస్ట్ ఆప్షన్ ఇది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని చీల్చుకుని మరీ దూసుకుపోయే సత్తా ఉంది మన ఫైటర్ జెట్లకు. ఎల్వోసీ దగ్గర పాకిస్తాన్ ఎన్నోసార్లు ఉల్లంఘనలకు పాల్పడింది. మేమూ అదే చేశామని ఐక్యరాజ్యసమితి దగ్గర సమర్థించుకోవచ్చు భారత్.
సర్జికల్ స్ట్రైక్స్
భారీ టార్గెట్లను గుర్తించి.. సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మరో ఆప్షన్. కాకపోతే సర్జికల్ స్ట్రయిక్స్ అనేవి అనూహ్యంగా జరిగేవి. ఇప్పుడు పాకిస్తాన్ అప్రమత్తంగా ఉంది. మన స్ట్రయిక్స్ని తిప్పికొట్టినా కొట్టొచ్చు. కానీ.. రియల్టైమ్ ఇంటెలిజెన్స్, కచ్చితమైన ప్లానింగ్తో చేస్తే సర్జికల్ స్ట్రయిక్స్తో హిట్టు కొట్టొచ్చు.
మిస్సైళ్లు.. స్నైపర్లతో విరుచుకుపడటం..
మిస్సైళ్లు.. స్నైపర్లతో విరుచుకుపడటం.. మరో ఛాయిస్. లక్ష్యాల పైకి గురిపెట్టి భారీ శతఘ్నులు, స్నైపర్ గన్స్తో కాల్పులు జరపొచ్చు. భారీ మోర్టార్లను కూడా వాడొచ్చు. వీటివల్ల చెప్పుకోదగ్గ తీవ్రత ఉండదు.
ఇంకా.. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర శత్రు స్థావరాలు, సరఫరాల మార్గాలు, ఔట్పోస్టులను తుడిచి పెట్టొచ్చు. అరేబియా సముద్రంలో మన నేవీ దళాలను అడ్డుగా పెట్టి పాకిస్తాన్ ఓవర్సీస్ వాణిజ్యాన్ని దెబ్బకొట్టొచ్చు. ఇలా అనేకానేక మార్గాల్ని వడగడుతోంది భారత్. సో.. ఏ క్షణంలోనైనా యాక్షన్ పార్ట్లోకి దిగి.. పాకిస్తాన్కి చుక్కలు చూపించడం ఖాయం..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..