
హైదరాబాద్, జూన్ 25: అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంతో సహా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టాం అంటూ వరుస ఈమెయిల్స్ రావడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు కరువైంది. గుజరాత్ మాత్రమేకాదు దేశంలో మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసగా 21 బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. జనాలు భయంతో గజగజవణికిపోయారు. అయితే ఇదంతా ఓ మహిళ ఆడిన నాటకం అని తెలిసి పోలీసులు షాకయ్యారు. అసలేం జరిగిందంటే..
తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న మహిళా ఇంజినీర్ రెనె జోషిడానే.. గుజరాత్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి ముప్పుతిప్పలు పెట్టింది. వరుస బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె పంపించిన ఈమెయిల్స్ నకిలీ ఇమెయిల్ ఐడీలు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు (VPN), డార్క్ వెబ్ నుంచి వచ్చాయి. ఈ క్రమంలో బాంబు బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డావని పోలీసులు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం మరింత షాక్కు గురి చేసింది. తాను ప్రేమించిన విజయ్ ప్రభాకర్ అనే వ్యక్తి తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో బాంబ్ బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లు జోషిడా తెలిపింది. బెదిరింపు మెయిల్స్ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించినట్లు చెప్పింది. తనను గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చిన్న పొరబాటువల్ల దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు.
దీనిపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్) శరద్ సింఘాల్ మాట్లాడుతూ.. జోషిల్డా వేర్వేరు ఇమెయిల్ ఐడీలను సృష్టించారని, వాటిలో కొన్ని దివిజ్ ప్రభాకర్ పేరుతో పంపించినట్లు తెలిపారు. రోబోటిక్స్లో శిక్షణ పొందిన ఇంజనీర్ అయిన జోషిల్డా 2022 నుంచి చెన్నైలోని ఒక బహుళజాతి సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుంది. ఆమె దివిజ్ ప్రభాకర్ అనే వ్యక్తిని లవ్ చేసింది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. దీంతో రగిలిపోయిన జోషిల్డా అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అంతే అతడి పేరుతో నకిలీ ఈమెయిల్ ఐడీలను సృష్టించి గుజరాత్తోపాటు మొత్తం 12 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు తెలిపారు. తనను మోసం చేసిన వ్యక్తిపై కక్ష సాధిస్తున్నట్లు భావించిన జోషిల్డా.. తన చర్యల వల్ల వేల మంది అమాయకులను భయబ్రాంతులకు గురవుతున్నారనే విషయాన్ని మర్చిపోయింది. గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం, బిజె మెడికల్ కాలేజీ, అహ్మదాబాద్లోని రెండు పాఠశాలలను పేల్చివేస్తామని బెదిరిస్తూ జోషిల్డా నకిలీ ఖాతాల నుంచి ఈమెయిల్స్ పంపినట్లు ఆయన తెలిపారు.
అదేవిధంగా జెనీవా లిబరల్ స్కూల్కు నాలుగు మెయిల్స్, దివ్యజ్యోతి స్కూల్కు మూడు మెయిల్లు, బీజే మెడికల్ కాలేజీకి ఒక మెయిల్ చేసిందని తెలిపారు. అయితే ఆమె ఎంతో తెలివిగా వర్చువల్ ట్రయిల్ను బహిర్గతం చేయకుండా జాగ్రత్త పడింది. చిన్న పొరబాటుతో పోలీసులకు దిరికిపోయింది. జూన్ 3న ఓ పాఠశాలకు బెదిరింపు మెయిల్ అందిన తర్వాత అహ్మదాబాద్లోని సర్ఖేజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభమైంది. దీని ఆధారంగా తీగ లాగితే డొంకంత కదిలిందని శరద్ సింఘాల్ తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.