
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో వృద్ధ సభ్యుడి మరణం తర్వాత ఏర్పాటు చేసిన విందులో సాంప్రదాయ మద్యం ‘హండియా’ పోయ్యలేదన కారణంతో ఒక గిరిజన కుటుంబాన్ని బహిష్కరించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ సంఘటన శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశపద గ్రామంలో జరిగింది. అక్కడ సంతాల్ తెగకు చెందిన 67 ఏళ్ల రామ్ సోరెన్ మార్చి 27న మరణించాడు. ఒక నెల తర్వాత, అతని కుమారుడు సంగ్రామ్ సోరెన్ సంప్రదాయం ప్రకారం విందు ఏర్పాటు చేశాడు. కానీ అతను అందులో హండియా ఏర్పాటు చేయలేదు.
తన తండ్రి మద్యపాన వ్యసనం కారణంగా మరణించాడని, కాబట్టి అతను తన విందులో హండియా పోయలేదని సంగ్రామ్ చెబుతున్నాడు. అయితే గ్రామస్థులు మాత్రం అతని నిర్ణయాన్ని తప్పుబట్టారు. హండియా పోయలేదన కారణంగానే గ్రామస్తులు సంగ్రామ్, అతని భార్య లచ్చా, ముగ్గురు పిల్లలను సామాజికంగా బహిష్కరించారు. ఆ కుటుంబం గ్రామంలోని చెరువు లేదా గొట్టపు బావి నుండి నీరు తీసుకోవడానికి అనుమతి లేదు. దుకాణాల నుండి వస్తువులు కొనడం కూడా నిషేధించారు. గ్రామస్తులు తమతో మాట్లాడరని లేదా వారికి ఎటువంటి పని ఇవ్వరని లచ్చా చెప్పారు.
పోలీసుల జోక్యం..
సంగ్రామ్ ఫిర్యాదు తర్వాత, పోలీసు బృందం గ్రామానికి చేరుకుంది. ఎవరినైనా సామాజికంగా బహిష్కరించడం చట్టపరమైన నేరమని పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రమాకాంత్ పాత్రా గ్రామస్తులకు వివరించారు. పరస్పర చర్చల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకునేందుకు ఆయన గ్రామస్తులకు రెండు రోజుల సమయం ఇచ్చారు. ఈ విషయం పరిష్కారం కాకపోతే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసక్తికరంగా శాంతల్ కమ్యూనిటీకి చెందిన ఒక పూజారి కూడా ఈ విందులో హండియా వడ్డించడం మతపరమైన బలవంతం కాదని, కానీ అది కుటుంబం కోరిక, ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుందని అంగీకరించారు. హండియాను ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ గిరిజన సమాజంలో సాంప్రదాయ పానీయంగా పిలుస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి