హైదరాబాద్ మలక్పేటలో వివాహిత శిరీష మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీషకు మత్తుమందు ఇచ్చి చంపిన భర్త, ఆయన సోదరి చంపినట్లు పోలీసులు గుర్తించారు. భర్త వినయ్తో పాటు సోదరి సరితను పోలీసులు అరెస్టు చేశారు. సరిత అక్రమ సంబంధం బయట పెట్టినందుకే శిరీషను హత్య చేసినట్లు తెలుస్తోంది. తన అక్రమ సంబంధం గురించి అందరికీ చెబుతోందని శిరీషతో సరిత గొడవ పడింది. కొద్ది నెలల క్రితం అమెరికా నుంచి వచ్చింది సరిత. ప్రస్తుతం ఒకే ఆస్పత్రిలో శిరీష, సరిత నర్సులుగా పనిచేస్తున్నారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటుండడంతో శిరీషకు సరిత మత్తుమందు ఇచ్చి చంపేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష మృతదేహాన్ని భర్త వినయ్ మాయం చేయాలనుకున్నట్లు పోలీసులు గుర్తించారు. శిరీషకు మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు తేల్చారు. హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు సరిత, వినయ్. శిరీష చనిపోయిన అనంతరం గుండెపోటు వచ్చిందంటూ శిరీష మేనమామకు వినయ్ ఫోన్ చేశాడు. తాను వచ్చేవరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని మేనమామ చెప్పాడు. శిరీష మేనమామ వచ్చేలోపే డెడ్ బాడీని తరలించడంతో అనుమానం వచ్చింది.
పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీసీ కెమెరాల ద్వారా అంబులెన్స్ని మేనమామ ట్రేస్ చేసి పట్టుకున్నారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేసిన డాక్టర్లు.. హత్యగా ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. దీంతో అక్కను తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.