తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడించారు. ఇందులో కొందరు విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే.. మరికొందరేమో ఫెయిలైనారు. ఫెయిలైన విద్యార్ధులకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్లను కూడా ప్రకటించాయి. అయితే కొందరు విద్యార్ధులు ఫెయిలైయ్యామని ఇంట్లో ఏడుస్తూ కూర్చోకుండా మళ్లీ ఎలా పాస్ అవ్వాలి.. అనే ప్రగతి ధోరణిలో అడుగులు వేస్తూ.. సప్లిమెంటరీ కోసం కష్టపడి చదువుతున్నారు. కానీ కొందరు విద్యార్ధులు మాత్రం ఫెయిలైనందుకు కుమిలిపోతూ దారుణ నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు వేయట్లేదు. ఇందుకు ఆజ్యం పోస్తున్నట్లు వారి తల్లిదండ్రులతోపాటు బంధుమిత్రులు ‘ఫెయిలైయ్యావ్.. ఎందుకూ పనికిరావు!’ అంటూ తిట్టిపోస్తుంటారు. దీంతో వారు మరింత కుంగిపోతుంటారు.
అయితే తాజాగా ఓ విద్యార్ధి పదో తరగతి పరీక్షల్లో ఆరు సబ్జెక్టులూ ఫెయిలైనాడు. కానీ ఆ విద్యార్ధి తల్లిదండ్రులు తమ కొడుకును మందలించలేదు సరికదా.. కెక్ కట్ చేసి మరీ సెలబ్రేట్ చేసుకున్నారు. అదేంటీ అని అనుకుంటున్నారా? ఎస్ఎస్ఎల్సి పరీక్షలో ఆరు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన తమ కొడుకుకు ఇలా వేడుక చేసి.. అతడిలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెరిగేలా ప్రోత్సహించారు అతడి కన్నోళ్లు. తమ కొడుకు పరీక్షలో ఫెయిల్ అయినా.. అతడు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా నిలదొక్కుకోవడానికి సోదరుడు, చెల్లి, అమ్మమ్మ, తల్లిదండ్రులు.. ఇలా కుటుంబం మొత్తం కేక్ కట్ చేయించి నోరు తీపి చేశారు. ఈ సంఘటన కర్ణాటక బాగల్కోట్లో చోటు చేసుకుంది.
బాగల్కోట్లో బసవేశ్వర హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో 10వ తరగతి చదివిన అభిషేక్ యల్లప్ప చోళచగుడ్డ 625కి 200 మార్కులు తెచ్చుకుని ఫెయిల్ అయ్యాడు. 6 సబ్జెక్టులలో 6 ఫెయిల్ అయినప్పటి నుంచి విచారంగా ఉండసాగాడు. బాధలో ఉన్న అభిషేక్ని ధైర్యం చెప్పేందుకు అతడి తల్లిదండ్రులు అతడి కోసం కేక్ తీసుకొచ్చి, దానిపై అభిషేక్కు టెన్త్లో వచ్చిన 200 మార్కులను కేక్పై రాయించారు. తర్వాత వచ్చే పరీక్షల్లో మరింత రానించాలని ధైర్యం చెప్పి కేక్ తినిపించి, ముద్దులు కూడా పెట్టారు. ఈ ఘటనతో మనసులో దిగులు గూడుకట్టుకున్న అభిషేక్ ముఖంపై చిరునవ్వు వికసించింది. మళ్లీ పరీక్ష రాసి, పాసై, జీవితంలో విజయం సాధిస్తానని ఆనందంగా చెబుతున్నాడు.
ఇవి కూడా చదవండి
నిజానికి, అభిషేక్ 15 నెలల వయసులో తన రెండు కాళ్ళు కాలిపోవడంతో జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. దీని కారణంగా అభిషేక్ గుర్తుంచుకునే సామర్ధ్యం కోల్పోయాడు. అందువల్లనే పరీక్షల్లో సమాధానాలు రాయలేక ఫెయిలైనాడని అతడి తల్లిదండ్రులు తెలిపారు. అభిషేక్ తల్లిదండ్రుల వినూత్న ఆలోచనకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు ఇలా ట్రీట్ చేస్తే అసలెవరూ ఆత్మహత్య చేసుకోరని, కుంగిపోరని నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. మనం కూడా ఇలా చేద్దామా..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.