Hyderabad: పూరీని తలపించిన హైదరాబాద్‌ నగర వీధులు.. కన్నుల పండుగగా సాగిన జగన్నాథుని రథయాత్ర

Hyderabad: పూరీని తలపించిన హైదరాబాద్‌ నగర వీధులు.. కన్నుల పండుగగా సాగిన జగన్నాథుని రథయాత్ర


బంజారాహిల్స్‌లో ఉన్నటువంటి జగన్నాధుని ఆలయంలో రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. ఆలయంలో ఉన్నటువంటి బలరాముడు, సుభద్ర, జగన్నాథులను వేద మంత్రాలతో, మేల తాళాలతో రథాల మీదకు తీసుకొచ్చారు. ఆ తర్వాత భక్తుల సందర్శన అనంతరం రథాలు కదిలాయి. ముందుగా బలరాముని రథం కదలగా ఆ తర్వాత సుభద్ర రథం, ఆ తర్వాత జగన్నాథుని రథం కదిలాయి. పూరి టెంపుల్‌ నుంచి మొదలైన ఈ యాత్ర బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కనకదుర్గమ్మ ఆలయం వరకు కొనసాగింది. తొమ్మిది రోజులపాటు కనకదుర్గమ్మ ఆలయంలో బలరాముడు, సుభద్ర, జగన్నాథులను ఉంచుతారు. ఆ తర్వాత తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువచ్చి రెండు రోజులు భక్తుల సందర్శనార్థం బయట ఉంచుతారు. ఆ తర్వాత తిరిగి 11వ రోజు బలరాముడు, సుభద్ర, జగన్నాధులను గర్భ గుడిలోకి తీసుకెళ్తారు.

పూరిలో ఏ సమయంలో అయితే జగన్నాథ రథయాత్ర ప్రారంభమైందో అదే సమయంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్నటువంటి జగన్నాథ ఆలయంలో కూడా రథయాత్ర ప్రారంభమైంది. పూరిలో ఏ విధంగా రథయాత్ర సాగిందో.. అదే విధంగా ఇక్కడ కూడా కన్నుల పండుగ రథయాత్ర కొనసాగింది. భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా రథయాత్రలో పాల్గొన్న భక్తులు రథాన్ని లాగడానికి పోటీపడ్డారు.

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు..ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన రథయాత్ర మొదలవుతుంది. ఆ జగన్నాథుని ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు, ఆయన రథం మీద ఒక చేయి వేసేందుకు లక్షలాది ప్రజలు వేచి చూస్తుంటారు. ఆషాఢశుద్ధ విదియ రోజు ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. శతాబ్దాల చరిత గల ఆ దేవదేవుడికి ఏటా జరిపే ఈ రథయాత్ర నిత్యనూతన శోభితంగా కనిపిస్తుంది. శ్రీమహావిష్ణువు దారుబ్రహ్మగా కొలువుదీరిన పూరీ క్షేత్రంతో పాటు దేశవిదేశాల్లో ఈ జగన్నాథ రథచక్రాలు కదులుతాయి. ఆ దృశ్యాన్ని వీక్షించడాన్ని భక్తులు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు.

ఒరిస్సాలోని పూరీలో ఏ విధంగా జగన్నాధుని రథయాత్ర సాగుతుందో అదే విధంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని జగన్నాథుని ఆలయంలో కూడా రథయాత్ర సాగుతుంది. జగన్నాధుని ఆలయం అంటే అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం. జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు ఆలయంలో కొలువై ఉంటారు. జగన్నాథుడు, సుభద్ర, బలరాములు ముగ్గురు దేవత మూర్తులకు చెందిన రధాలు రథయాత్రలో సాగాయి. జగన్నాథుని రథయాత్రలో వేలాది మంది భక్తులకు పాల్గొన్నారు. బంజారాహిల్స్ లోని ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథస్వామిగా అన్న బలరాముడు, చెల్లెలు సుభద్రతో కొలువు తీరి ఉంటాడు.

స్వామిని శైవులు శివుడిగా, శాక్తేయులు భైరవునిగా, బౌద్ధులు బుద్ధునిగా, జైనులు ‘అర్హర్ద’గా, అలేఖ్యులు శూన్య స్వరూపునిగా పూజిస్తారు. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జనన విద్యతే’ రథంపై విష్ణుమూర్తి ఊరేగుతున్న దృశ్యం వీక్షించిన వారికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అందునా పూరీలో జగన్నాథ రథోత్సవాన్ని శతాబ్దాల తరబడి నిర్వహిస్తున్నా నిత్యనూతనంగానే ఉంటుంది. ఏ ఆలయంలోనైనా ఉత్సవమూర్తులందరినీ ఒకే రథంలో తీసుకు వెళ్లడం సహజం. కానీ జగన్నాథుని ఆలయంలో మాత్రమే ముగ్గురు దేవతామూర్తులు జగన్నాథ, బలభద్ర, సుభద్రలను వేర్వేరు రథాల్లో ఊరేగిస్తారు. అన్నగారి రథం అగ్ర భాగాన ఉంటే.. ఆ తర్వాత చెల్లెలి రథం వెళుతుంది. జగన్నాథుని రథం వారిని అనుసరిస్తూ వెళ్తుంది. ఇది అన్నలకు సోదరి సుభద్రను .సు‘భద్రం’గా చూసుకునే తీరును, ‘చెల్లెలి’పై అనురాగాన్ని చాటిచెబుతుంది.

జగన్నాథస్వామి రథాన్ని నందిఘోష’ అంటారు. ఇది పదహారు చక్రాలతో 41 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథాన్ని తేరును తెలుపు, పసుపు వస్త్రాలతో అలంకరిస్తారు. ఈ రథాన్ని లాగే తాడును ‘శంఖచూడ నాగ’ అంటారు. ఇక బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం అంటారు. ఇది 14 చక్రాలతో 43 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ రథాన్ని ఎరుపు, ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరిస్తారు. దీనికి ఉపయోగించే తాడును. ‘వాసుకీ నాగ’ అంటారు. తర్వాత సుభద్ర రథాన్ని ‘దర్పదళన్‌’ అంటారు. ఇది 12 చక్రాలతో 42 అడుగులు ఎత్తును కలిగి ఉంటుంది. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. దానికి వాడే తాడును ‘స్వర్ణచూడ నాగ’ అంటారు. ఇక్కడున్న ప్రతి రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందంగల తాళ్లను కడతారు. వాటిని పట్టుకొనే జనం రథాన్ని ముందుకు లాగుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *