ఒడిశాలోని జగత్సింగ్పుర్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. గర్భవతి అని తెలిసి సజీవంగా పాతిపెట్టేందుకు యత్నించారు. గొయ్యిని చూసి అనుమానంతో బాలిక పారిపోయింది. విషయం ఇంట్లో చెప్పడంతో కుజంగ్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అన్నదమ్ములు భాగ్యదర్ దాస్, పంచనన్దాస్తో పాటు స్నేహితుడు తుళుబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మైనర్ బాలికపై నిందితులు చాలా కాలం నంచి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నారు. బాలిక గర్భం దాల్చడంతో భయపడిపోయారు. తప్పించుకోవడానికి ఆమెను సజీవంగా పాతిపెట్టడానికి ప్రయత్నించారు. డబ్బులు ఇస్తామని నమ్మించి బాలికను ఒక నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. అబార్షన్ చేయించుకోవాలని అందుకు ఎంత ఖర్చయినా తామే భరిస్తామని బాలికపై ఒత్తిడి తెచ్చారు. తమ మాట వినకుంటే బతికుండగానే పాతిపెడతామని బెదిరింపులకు దిగారు. ఈ క్రమంలో అక్కడ గుంత తవ్వి ఉండటాన్ని గమనించిన బాలిక అనుమానంతో అక్కడి నుంచి తప్పించుకుని విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది.
బాలిక తండ్రి కుజాంగ్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను జిల్లా ప్రధాన కార్యాలయ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
జగత్సింగ్పూర్లో ఈ వారంలో నమోదైన రెండవ లైంగిక హింస కేసు ఇది. మంగళవారం, పుట్టినరోజు పార్టీ నుండి తిరిగి వస్తుండగా వ్యవసాయ భూమిలో ఇద్దరు వ్యక్తులు మరో మైనర్ను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఆరోపించారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం, మల్కాన్గిరి జిల్లాలో ఇలాంటి కేసు నమోదైంది. ఒక మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె వారి బారి నుండి తప్పించుకోగలిగింది. కానీ ఆమె ఇంటికి వెళ్తుండగా ట్రక్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కనీసం 12 అత్యాచారాలు నమోదయ్యాయి. 10 రోజుల వ్యవధిలోనే ఐదు అత్యాచారాలు, ఒక సామూహిక అత్యాచార కేసులు నమోదయ్యాయి.