చికున్గున్యా అనేది దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఇది ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ముఖ్యంగా చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో భయాందోళనలను రేకెత్తించింది. ఇక్కడ వేలాది మంది దీని బారిన పడ్డారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ప్రకారం, 2025 ప్రారంభం నుండి 16 దేశాలలో సుమారు 2.4 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. 90 మంది మరణించారు. చికున్గున్యా వైరస్, దాని లక్షణాలు, ప్రభావిత ప్రాంతాలు, చైనాతో సహా ఇతర దేశాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం..
చైనాలో చికున్గున్యా కేసులు పెరుగుతున్నాయి. గువాంగ్డాంగ్ ప్రావిన్సులో జూలై నుంచి ఇప్పటివరకు 7,000 కేసులు నమోదయ్యాయి. ఫోషన్ నగరంలో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నెగటివ్ వచ్చినవారిని మాత్రమే డిశ్చార్జ్ చేస్తున్నారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో చికున్గున్యా కేసులు పెరుగుతుండటంతో చైనా ప్రభుత్వం కొవిడ్ తరహాలో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఫాగింగ్, డ్రోన్లతో పర్యవేక్షణతో పాటు, ప్రత్యేక చర్యగా ఎలిఫెంట్ మస్కిటోలు ను వదిలింది. ఈ ఏనుగు దోమలకు మరో పేరు టెక్సోరెంకైటిస్. ఇవి ఇతర దోమల గుడ్లను తింటాయి. ఒక్క లార్వా 100 గుడ్ల వరకు తినగలదు. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
2025 ప్రారంభం నుండి చికున్గున్యా కేసులు వేగంగా పెరిగాయి. ECDC ప్రకారం, 16 దేశాలలో 2.4 లక్షల కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. బ్రెజిల్లో 1,85,553 కేసులు, బొలీవియా 4,721, అర్జెంటీనా 2,836, పెరూ 55 కేసులు నమోదయ్యాయి. అదనంగా, లా రీయూనియన్, మయోట్టే, మారిషస్ వంటి హిందూ మహాసముద్ర దీవులలో కూడా పెద్ద వ్యాప్తి కనిపించింది. లా రీయూనియన్ మే 2025 నాటికి 47,500 కంటే ఎక్కువ కేసులను నివేదించింది. కాగా, చైనాలో చికున్గున్యా కేసులు వ్యాప్తి కావడంతో.. అమెరికా తమ ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. చైనా టూర్లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.