గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, “నేను దైవాన్ని నమ్ముతాను. అలాగే నా తల్లిదండ్రుల ఆశీర్వాదం, కళామతల్లి ఆశీర్వాదం. ఇవన్నీ కలగలిపితే ఒక డాకు మహారాజ్. వరుసగా ఇది నాకు నాలుగో విజయం. కోవిడ్ సమయంలో సాహసించి అఖండ సినిమాను విడుదల చేశాము. ఆ సినిమా అఖండ విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ధైర్యాన్ని ఇతర సినిమాలకు కలిగించింది. ఆ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. ప్రతి సినిమాని ఒక ఛాలెంజ్ గా తీసుకొని చేస్తాను. ప్రేక్షకులకు ఎటువంటి సినిమా అందించాలనేది నటీనటులు, దర్శకనిర్మాతలు ఆలోచించుకోవాల్సిన విషయం. ‘డాకు మహారాజ్’ కథ అనేది నీటి గురించి. నీటి సమస్య గురించి ప్రజలకు అవగాహన కలిగించిన సినిమా డాకు మహారాజ్. ఒక తెలుగు ఇంజనీర్ రాజస్థాన్ వెళ్లి, అక్కడి ప్రజల కోసం డాకుగా మారడం ఈ సినిమాలో చూశారు అన్నారు.
మా సినిమాని ఆదరించి, అఖండమైన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. ప్రతి నటుడు నుంచి అందమైన హావభావాలను రాబట్టుకోగలిగాడు దర్శకుడు బాబీ. నన్ను ఎంతగానో ప్రేమించి, నాలో ఉన్న నట విశ్వరూపాన్ని ఆవిష్కరించేలా చేశాడు. మంచి సన్నివేశాలతో, క్లుప్తంగా, అందంగా సినిమాని రూపొందించాడు. థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు తన ఇంటిపేరు మార్చేశారు. ఎస్.ఎస్.థమన్ కాదు, నందమూరి థమన్ అంటున్నారు. నేనైతే ఇప్పటినుంచి ఎన్.బి.కె. థమన్ అని నామకరణం చేస్తున్నాను. అనంత శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. అఖండ తర్వాత నా కాంబినేషన్ లో ప్రగ్యా జైస్వాల్ నటించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం సంతోషంగా ఉంది. అందం, టాలెంట్ కలగలిపిన నటి శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాలో బరువైన పాత్రలో అద్భుతంగా నటించింది. ఫైట్ మాస్టర్ వెంకట్ గారు, కెమెరామ్యాన్ విజయ్ కార్తీక్ గారు, డ్యాన్స్ మాస్టర్లు శేఖర్ మాస్టర్, శివ మాస్టర్.. ఇలా అందరూ నూటికి నూరుపాళ్లు వారి బాధ్యతకు న్యాయం చేశారు. మా నిర్మాత వంశీ గారు నా అభిమాని. ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను ఆవిష్కరించాలని ఆయన కల కన్నారు. అన్ని క్రాఫ్ట్స్ మీద మంచి గ్రిప్ ఉన్న నిర్మాత వంశీ గారు. అటువంటి నిర్మాత నా అభిమాని కావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎన్నో అద్భుతమైన సినిమా తీశారు. మునుముందు మరిన్ని అద్భుతమైన సినిమాలు తీయాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే వేద అద్భుతంగా తన పాత్రను పోషించింది. మంచి భవిష్యత్ ఉంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ఇతర దేశస్తులు కూడా మన సినిమాలను చూసి ప్రశంసించే స్థాయికి తెలుగు చలన చిత్రసీమ ఎదిగింది. నా వరకు చూసుకుంటే, నా రికార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా కలెక్షన్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా అవార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్, నా రివార్డ్స్ అన్నీ అన్ స్టాపబుల్. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. డాకు మహారాజ్ విజయంతో ఇది మరోసారి రుజువైంది. ఈ సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు నా కృతఙ్ఞతలు. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించలేకపోయాము. అందుకే జనవరి 22న అనంతపురంలోనే విజయోత్సవ పండుగను జరుపుకోవాలని నిర్ణయించాము. మంచి సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లిన పాత్రికేయ మిత్రులకు కృతఙ్ఞతలు.” అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..