మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ కీలక నేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతి చెందారు. ఆయనతో పాటు మరో 18 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా మావోయిస్టు పార్టీనే ధృవీకరించింది. ఎన్నో ఏళ్లుగా దామోదర్ పోలీసుల హిట్ లిస్టులో ఉన్నారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ చాలా యాక్టీవ్గా పనిచేశారు. 6 నెలల క్రితమే రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన చొక్కారావుపై ఛత్తీస్గఢ్లో రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసుల తెలిపారు. తెలంగాణలోనూ 25లక్షల రివార్డు ఉంది. ఆయన స్వస్థలం… ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం. చొక్కారావుతో పాటు మరో తెలుగు నేత నర్సింహారావు రావు కూడా మృతి చెందినట్లు దక్షిణ బస్తర్ కార్యదర్శి గంగా పేరిట విడుదల చేసిన లేఖలో మావోయిస్టులు వెల్లడించారు.
2026 వరకే నక్సల్స్ మనుగడ. ఈలోపల లొంగితే ఓకే. లేకుంటే ఏరివేతే అన్నట్టుగా మావోయిస్టులను హెచ్చరిస్తున్నాయి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు. నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ‘ఆపరేషన్ సమాధాన్’ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. ఆపరేషన్ సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. కానీ ఆపరేషన్ సమాధాన్..సమాధానం లేకుండా ముగిసింది. అయినా కేంద్రం వెనక్కి తగ్గలేదు. 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల వేట ప్రారంభమైంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది
ఇటు భద్రతాబలగాలు కేంద్రం మాటలకు తగ్గట్టుగానే తమ తుపాకులకు పనిచెబుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలను ఏరివేస్తున్నారు. అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు పోలీసుల బుల్లెట్లకు నేలకొరుగుతున్నారు. లేటెస్ట్గా తెలంగాణ సరిహద్దుకు 30కిలోమీటర్ల దూరంలో 24 గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో 19మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాదిలో ఇది ఐదో ఎన్కౌంటర్. ఇప్పటివరకు 35మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ప్రతిరోజూ భారీ కూంబింగ్ జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి