
గోల్డ్ లోన్ చెల్లించలేని కారణంగా బ్యాంకులు ఇష్టారీతిన ప్రజల సొమ్మును వేలం వేయడానికి వీల్లేదని కేంద్రం ప్రకటన చేసింది. బంగారం వేలం వేసే విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు లోక్ సభలో ప్రకటన చేశారు.
వారిపై కఠిన చర్యలు..
కమర్షియల్ బ్యాంకులు సామాన్యుల సొమ్మును వేలం వేసే పక్షంలో కచ్చితంగా ఆర్బీఐ నిబంధనలను పాటించి తీరాలనే రూల్స్ ఉన్నాయి. అయితే, కొందరు సాధారణ పాన్ షాపుల్లో తమ బంగారాన్ని తాకట్టు పెడుతుంటారు. అయితే వీరు ఎలాంటి రూల్స్ పాటించరు. కస్టమర్లకు గడువు ముగిసిన తర్వాత ఎలాంటి హెచ్చరికలు లేకుండా వారి బంగారాన్ని వేలం వేసేస్తుంటారు. ఇకపై ఎవరైనా ఇలా చేస్తున్నట్టు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హెచ్చరించారు.
కస్టమర్ కు తెలియజేయాలి..
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఒకేలాంటి నియమాలు పాటించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ బ్యాంకులు ఆర్బీఐ పరిధిలోకి రాకున్నప్పటికీ బిడ్డింగ్ విషయంలో వీరు కచ్చితంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది.
ఇలా కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం వేలం వేసే ముందు వారికి నోటీసులు పంపించాల్సి ఉంటుంది.
అందరికీ అవే రూల్స్..
ఆభరణాల సొమ్మును రుణ గ్రహీతలు తిరిగి చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు లేదా ఎన్ ఎఫ్ బీసీ వేలానికి వెళ్లవలసి వస్తుంది. కానీ దానిని కస్టమర్ కు సరిగ్గా తెలియజేయాలి. ఈ ప్రక్రియలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు ఈ విషయంలో ఒకే విధమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుందని నిర్మలాసీతారామన్ గుర్తుచేశారు.