బంగారం ధర రన్ రాజా రన్ అంటూ పట్టపగ్గాల్లేకుండా పరుగు పెడుతోంది. తెలుగురాష్ట్రాల్లో మార్చి 26 వరకు లక్షలాది వివాహాలు జరగనున్నాయి. ఈ క్రమంలో పెరిగిపోతున్న బంగారం ధరలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం రూ. 88 వేల మార్క్ దాటింది. గడిచిన 4 రోజుల్లో 24 క్యారెట్ల స్వచ్చమైన గోల్డ్ రేటు తులంరూ.2000 మేర పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 10 గ్రాములపై రూ.390 పెరిగి రూ.88 వేల 40 వద్ద కూర్చుంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ బంగారం ఇవాళ రూ.350 పెరిగి 10 గ్రాముల ధర రూ. 80 వేల 700కు ఎగబాకింది. విజయవాడ, విశాఖల్లోనూ రేట్లు ఇంచుమించు ఇలానే ఉన్నాయి.
ఓవైపు బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నా.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంటుంది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి రేటు రూ. 1.08 లక్షలుగా ఉంది. పైన ఇచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్స్.. ఫిబ్రవరి 21వ తేదీ ఉదయం 7 గంటల సమయంలో తీసుకున్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండవచ్చు.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థికమాంద్య భయాలు పెరిగిపోయాయి. బంగారం నిల్వలు పెంచుకోవడానికి అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా యుద్ధభయాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్మార్కెట్లు అంత సేఫ్ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే బంగారంపై భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి.. అలాగే మన స్టాక్మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. దీంతో డాలర్తో పోల్చితే రూపాయి మారకం పతనం అవుతోంది. ఈ అన్ని కారణాలతో బంగారం ధర పెరుగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి