హైదరాబాద్, ఫిబ్రవరి 27: రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. అయితే ఈ పర్వదినం పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వేర్వేరు ప్రాంతాల్లో పుణ్యస్నానాలకు వెళ్లి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటుచేసుకుంది. వివరాల్లకెళ్తే..
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరిలో బుధవారం నాడు కొందరు విద్యార్ధులు పుణ్యస్నానానికి వెళ్లారు. వీరిలో ఐదుగురు విద్యార్థులు గోదావరిలో గల్లంతై చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున 11 మంది స్నేహితులు కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లగా.. నది లోతు తెలియకపోవడంతో వీరిలో ఐదుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతులను పడాల దుర్గాప్రసాద్ (19), పడాల సాయి (19), తిరుమలశెట్టి పవన్ (17), ఏ పవన్ (19), జీ ఆకాశ్ (19)గా గుర్తించారు.
మరో ఘటనలో శ్రీశైలం పాతాళగంగలో పుణ్యస్నానానికి వెళ్లిన తండ్రీకొడుకులు నీట మునిగి మృతి చెందారు. మృతులు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిగా సమాచారం. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోచోట.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లికి చెందిన రాదం డి రాజేశ్ (50) అనే వ్యక్తి పుణ్యస్నానం చేసేందుకు గోదావరికి వెళ్లి.. అక్కడ గల్లంతయ్యాడు. శివరాత్రి సందర్భంగా అమ్మవార్ల విగ్రహాలను గోదావరికి తీసుకెళ్తుండగా ఊరి జనాలతోపాటు రాజేశ్ కూడా వెళ్లాడు. స్నానం కోసం గోదావరిలోకి వెళ్లి గల్లంతయ్యాడు. వేర్వేరు చోట్ల చోటు చేసుకున్న ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.