ఈనెల 14న పిఠాపురంలో జనసేన జయకేతనం సభ… పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల

ఈనెల 14న పిఠాపురంలో జనసేన జయకేతనం సభ… పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి నాదెండ్ల


మార్చి 14న జనసేన 12వ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. ఆవిర్భావ సభకు జయకేతనం అని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పేరు పెట్టినట్లు వెల్లడించారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద నిర్వహించే జయకేతనం సభ చరిత్రలో నిలిచిపోతుందని ఆయన తెలిపారు. ఈ మేరకు జయకేతనం సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

జయకేతనం సభకు ఏపీ నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనసైనికులు, మహిళలు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారని నాదేండ్ల మనోహర్‌ తెలిపారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నిర్వహించబోయే ఈ సభ స్థానిక చరిత్ర, సంస్కృతికి అద్దం పట్టేలా ఉంటుందని మనోహర్ వెల్లడించారు. ఈ ప్రాంతానికి విశేష సేవలందించిన మహానుభావులను స్మరించుకునే విధంగా మూడు ముఖద్వారాలకు వారి పేర్లు పెట్టామని ఆయన వివరించారు. తొలి ద్వారానికి పిఠాపురం మహారాజు శ్రీ రాజా సూర్యరావు బహదూర్ పేరు పెట్టామని తెలిపారు. ఆయన విద్యాభివృద్ధికి, సేవా కార్యక్రమాలకు ఎనలేని కృషి చేశారని వివరించారు.

రెండవ ద్వారానికి రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేసిన దొక్కా సీతమ్మ పేరు పెట్టామని, ఇక మూడవ ద్వారానికి విద్యాసంస్థలు స్థాపించి చరిత్ర సృష్టించిన మల్లాది సత్యలింగం నాయకర్ పేరు పెట్టామని నాదెండ్ల పేర్కొన్నారు. ఈ ముగ్గురు మహానుభావులు ఆయా ప్రాంతాలకు చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని మనోహర్ వెల్లడించారు.

భారతదేశ రాజకయీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజలు జనసేనకు అఖండ విజయాన్ని అందించారని మనోహర్ అన్నారు. పోటీ చేసిన ప్రతి స్థానంలో జనసేన విజయం సాధించిందని, ఇది జనసైనికులు, వీర మహిళలు, నాయకుల నిస్వార్థ సేవలకు ఫలితమని ఆయన కొనియాడారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పిఠాపురం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *