ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నీరు తాగడం ముఖ్యమని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్నిసార్లు శరీరంలో డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో మూత్రపిండాల సమస్యలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. ఆరోగ్యంగా ఉండటానికి, సరైన బరువును నిర్వహించడానికి రోజుకు 3 లీటర్ల నీరు తాగడం అవసరమని వైద్యులు అంటున్నారు.
నీళ్లు తాగేటప్పుడు సరైన నియమాల పాటించాలని నిపుణులు అంటున్నారు. లేదంటే వివిధ శారీరక సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది, ఎండ వేడి నుంచి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, వెంటనే రిఫ్రిజిరేటర్ నుంచి చల్లని నీరు తాగుతుంటారు. ఈ విధంగా రిఫ్రిజిరేటర్ నీటిని వెంటనే తాగకూడదని నిపుణులు అంటున్నారు. వేడిలో అసౌకర్యంగా అనిపిస్తే, గది ఉష్ణోగ్రత వద్ద కొద్దిగా సేపు కూర్చుని ఆ తర్వాత రిఫ్రిజిరేటెడ్ నీటిని తాగాలి.
అలాగే చాలా మందికి భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తినేటప్పుడు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కడుపు నుంచి వివిధ రసాలు స్రవిస్తాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి. ఈ సమయంలో ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, వికారం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు పెరుగుతాయి.
బాటిల్ నుంచి కాకుండా గ్లాసు నుంచి నీరు తాగడం మంచిది. నీరు త్రాగేటప్పుడు ఒకే చోట కదలకుండా కూర్చోవాలి. నడుస్తున్నప్పుడు లేదా అస్థిరంగా ఉన్నప్పుడు నీరు తాగే ప్రయత్నం చేయవద్దు. దీనివల్ల మీ గొంతు, ముక్కులో నీరు పోయే ప్రమాదం ఉంది. దీనివల్ల మీకు అసౌకర్యంగా అనిపిస్తుంది.
ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో నీరు తాగడం మంచిది. పళ్ళు తోముకునే ముందు నీళ్లు తప్పక తాగాలి. ఈ అలవాటు గుండెల్లో మంట సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన 1 గంట తర్వాత నీరు తాగాలి.