కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన పైండ్ల రాజు కన్నీటి కథ ప్రతి ఒక్కరినీ కదిలించేదిగా ఉంది. మంచానికే పరిమితమై… తానెక్కడున్నానో కూడా తెలియని ఒక సబ్ కాన్షియస్ స్టేటస్ లో ఐదేళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఓరోజు కొత్తపల్లి మండలం బావుపేటలో ఓ శుభకార్యం నిమిత్తం బైకుపై వెళ్లాడు. కార్యం చూసుకుని తిరిగివస్తుండగా… బావుపేట వద్ద రెండు బైకులు ఢీకొన్న ఘటనలో రాజు తలకు తీవ్రగాయాలయ్యాయి. దాంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి రాజుకు చికిత్సనందించారు. తలలో తీవ్ర గాయాలవ్వడంతో శస్త్ర చికిత్స చేశారు. రాజు కోమాలోకి వెళ్లాడు. ఇక పదిహేను రోజులైనా తెలివిమీదకు రాని రాజును తమ స్వగ్రామంలోని గుండి గోపాల్ రావు పేట ఇంటికి తరలించారు. అప్పటికే తమకున్న భూములు కూడా అమ్ముకుని సుమారు రాజు కోసం 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు రాజు తల్లిదండ్రులు హనుమాళ్లు, చిలుకమ్మ. ఇక ఆసుపత్రిలో ఉంచే స్థోమత లేక ఇంటికి తీసుకొచ్చి.. కోమాలో ఉన్న తన బిడ్డకు ఇంట్లోనే సపర్యలందిస్తున్నారు.
రాజుకు భార్య నవ్యతో పాటు.. ఇప్పుడు ఐదేళ్ల కొడుకున్నాడు. కొడుకుకు మూడు నెలల వయసున్నప్పుడు రాజుకు యాక్సిడెంట్ కాగా… నాన్నను రోజూ మంచంలో చూస్తూ పెరిగిన రాజు కొడుకు తన తండ్రి ఎప్పుడు లేస్తాడా అని ఎదురుచూస్తున్నాడు. రాజు భార్య నవ్య ఒకవైపు.. తన కుమారుడి కోసం తల్లిదండ్రులు చిలుకమ్మ, హనుమాండ్లు మరోవైపు నిరీక్షిస్తున్నారు. ఎప్పుడు మామూలు మనిషై తమతో కలిసి హాయిగా ఉండే రోజొస్తుందానని కళ్లల్లో వత్తులు వేసుకుంది ఈ కుటుంబం. ఐదేళ్ల నుంచి రాజుకు ముక్కు ద్వారానే జ్యూస్, వాటర్ వంటివి అందిస్తూ.. కాలకృత్యాలు, బట్టతో తుడుస్తూ శుభ్రపర్చడం వంటివన్నీ బెడ్ పైనే చేస్తున్నారు. నెలకు మందులకే ఓ ఆరేడు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా.. నెలకు ఒక్కసారి ఆసుపత్రి కి తీసుకెళ్లి చికిత్స అందించాలి. ఇప్పుడిప్పుడే రాజు శరీరం స్పందిస్తోంది. మరో పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టగల్గితే రాజు మళ్లీ తిరిగి కోలుకొని మామూలు మనిషయ్యే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు. కానీ, ఇప్పుడు రాజు కుటుంబం వద్ద డబ్బు లేదు. ఇప్పుడు రోజు వారి ఖర్చు లు కుడా ఈ కుటుంబానికి వెళ్లడం లేదు. దీంతో..ఈ పేద కుటుంబ మరింత ఆవేదన తో కుంగిపోతుంది.
గత ఐదేళ్లుగా జీవశ్ఛవంలా ఉన్న రాజును చూస్తూ… శోకసంద్రంలో ఆ దైవానికి ప్రార్థనలు చేస్తున్న రాజు కుటుంబానికి ఇప్పుడు ఆర్థికావసరం ఉంది. ఎవరైనా దాతలుగానీ.. ప్రభుత్వ పెద్దల దృష్టిగానీ రాజు దీనగాధపై పడితే.. రాజు బతుకును నిలబెట్టినవారవుతారు. రాజు బతుకుతాడని కోమాలో ఉన్న తనకు సపర్యలు చేస్తున్న ఆ కుటుంబీకుల ఆశనూ నిలబెట్టినవారవుతారు. అలా ఓ నిండు ప్రాణాన్ని కాపాడినవారవుతారు..
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..