తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల నుంచి భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి. నాడు కుమురం భీం ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరాటం చేసినా.. నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య పోరాటం చేసినా భూమితో వారికున్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చినవే. ఆ పోరాటాల నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గరి నుంచి పీవీ నరసింహారావు వరకు చేపట్టిన భూసంస్కరణలే గుర్తుకొస్తాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ధరణి పోర్టల్, కేసీఆర్ మానస పుత్రికల్లో ఒకటైన ధరణి పోర్టల్, తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ధరణి పోర్టల్.. ఆ తర్వాత ఓడలు బండ్లయ్యి బండ్లు ఓడలయ్యి ప్రభుత్వం మారడంతో గత పాలకులు భయపడినట్టు నిజంగానే బంగాళాఖాతంలో కలిసిపోయింది. సర్కారువారి భూహక్కు చట్టం అడ్డంగా నేలమట్టమైంది. దాని స్థానంలో కొత్తగా వచ్చింది భూభారతి చట్టం. భూములకు సంబంధించి సర్వకాల సర్వావస్థలకు చెక్ పెడుతూ, వ్యవసాయ భూముల్ని డిజిటలీకరించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం డిజైన్ చేసిన ధరణి పోర్టల్.. 2020 అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో కేసీఆర్ చేతుల మీదుగా జాతికి అంకితమైంది. తెలంగాణ మొత్తం భూభాగం 2 కోట్ల 75 లక్షల ఎకరాలైతే.. అందులో కోటీ 56 లక్షల ఎకరాలు ధరణి వెబ్సైట్లో రిజిస్టరైంది. దాన్ని కదిలించే అధికారం ఎవ్వరికీ లేకుండా.. పకడ్బందీగా చర్యలు తీసుకుంది.
నీ భూమ్మీద నీకే అధికారం.. నీ రికార్డును టచ్ చేసే అధికారం భూమ్మీద మరెవ్వడికీ ఉండదు ఉండబోదు.. అని భరోసా ఇచ్చింది ప్రభుత్వం. భూమికి రావల్సిన డబ్బులు నేరుగా బ్యాంకులో పడతాయని, ధాన్యం కొనుగోలు సమయంలో గాని, నష్టపరిహారం సమయంలో గాని.. నేరుగా మీ ఖాతాలోకే వస్తాయని, ధరణి లేకపోతే రైతుబంధు పైసలు రానే రావని చెప్పడం ద్వారా ధరణి పోర్టల్ని సూపర్ పాపులర్ స్కీమ్గా మారిపోయింది. కానీ.. నిర్వహణా లోపాలు, అవకతవకలు, కొందరి చేతివాటం.. అన్నీ కలిపి ధరణి చట్టాన్ని అత్యంత వివాదాస్పదంగా మార్చేశాయి. ఒకటో రెండో సమస్యలుంటే ఉండొచ్చు.. ఎమ్మార్వోనో, స్థానిక ఎమ్మెల్యేనో కలిసి కూర్చుని మాట్లాడి పరిష్కరించుకుంటే పాయె.. దానికే ఎందుకింత రాద్ధాంతం అనేమాటలతో ధరణి సమస్యాత్మకమే అని ఒప్పుకున్నట్టయింది గత ప్రభుత్వం. దాన్నే ఆసరాగా చేసుకుని, ధరణికి ప్రత్యామ్నాయం పేరుతో జనంలోకెళ్లి రాజకీయం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కొట్టింది. అధికారంలోకి వచ్చీరాగానే కోదండరెడ్డి నేతృత్వంలో కమిటి వేసి.. ధరణిలో లొసుగుల్ని పసిగట్టి.. కొత్త చట్టం రూపకల్పనకు నడుంకట్టింది రేవంత్ సర్కార్.
ఒకటోరెండో కాదు.. ధరణి పోర్టల్ నిండా బొక్కలేనన్న క్లారిటీకి రావడానికి ఎన్నో రోజులు పట్టలేదు కోదండరెడ్డి కమిటీకి. ధరణి మీద కంప్లయింట్ బాక్స్ ఓపెన్ చేస్తే.. ఏకంగా 99 వేల 752 ఫిర్యాదులు వచ్చిపడ్డాయి. వాటిలో 89 వేల 556 మాత్రమే ఆఫ్లైన్లో పరిష్కారమయ్యాయి. మిగతావన్నీ సమస్యలుగానే మిగిలిపోయాయి. వీటన్నిటికీ ఏకైక పరిష్కారం.. కాంగ్రెస్ పార్టీ సమర్పించు జిందా తిలిస్మాత్ ఇదిగో అంటూ.. భూభారతి పేరుతో కొత్త పోర్టల్కి రిబ్బన్ కత్తిరించింది రేవంత్ ప్రభుత్వం. ధరణితో కలిగిన వ్యాధులన్నింటినీ మాయం చేసే సంజీవని మొక్క అంటూ భూభారతి పోర్టల్ను ప్రమోట్ చేసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ధరణితో నానా ఇబ్బందులు పడి పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఆశాకిరణంగా కనిపిస్తోంది భూభారతి పోర్టల్. రైతు సదస్సులు ఏర్పాటు చేసి.. అవగాహన కల్పించి ఆ తర్వాతే పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ సంకల్పం. ప్రస్తుతానికి నాలుగు పైలట్ మండలాల్లోని గ్రామాలకు వెళ్లి ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. జూన్ 30లోపు సమస్యలన్నింటినీ పరిష్కరించి వెబ్సైట్లో చేయాల్సిన మార్పులపై ఒక స్పష్టతకొస్తారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో భూభారతి పోర్టల్పై ఇప్పటికే ప్రాధమిక కసరత్తు మొదలైంది. గతంలో 33 మాడ్యూల్స్తో క్లిష్టతరంగా కనిపించింది ధరణి వెబ్సైట్. భూభారతి మాత్రం ఆరే ఆరు మాడ్యూల్స్తో.. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో.. అందరికీ అర్థమయ్యేలా.. అత్యంత సరళతరంగా ఉందనేది మొట్టమొదటి కాంప్లిమెంట్.
రికార్డుల్ని మార్చినవాళ్లపై నిఘా
భూమి హక్కుల రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ, భూదాన్, ఎసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే.. వాటిని ఉన్నపళంగా రద్దు చేయాలంటూ రాష్ట్ర భూపరిపాలనా ప్రధాన కమిషనర్కు ఎవరైనా దరఖాస్తు చేయవచ్చు. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటారు. భూభారతి చట్టంలోని 16వ సెక్షన్, 15వ నిబంధన ఇందుకోసమే ఉంది. ధరణిలో ఇటువంటి అవకాశమే లేదు.
గ్రామ రెవెన్యూ రికార్డులూ సేఫ్
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. వాటి గురించిన ప్రస్తావనే ధరణిలో లేదు. కానీ.. భూభారతి చట్టంలో గ్రామ రెవెన్యూ రికార్డుల పేరుతో సెక్షన్ 13లో ప్రత్యేక నిబంధన పెట్టారు. గ్రామ పహాణీ, ప్రభుత్వ భూములు, చెరువుల భూముల.. వీటి రికార్డులు సైతం భూభారతిలో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. ఏటా డిసెంబరు 31న గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రతుల్ని ప్రింట్ చేసి విడిగా భద్రపరుస్తారు.
ఉచితంగానే న్యాయ సహాయం
ప్రజలు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి ధరణి చట్టంలో ఎలాంటి నిబంధనా లేదు. కానీ.. ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ఉచిత న్యాయ సహాయం, సలహాలను అందించేందుకు వీలు కల్పిస్తోంది భూభారతి చట్టం. భూ సంబంధిత చట్టాల్లో ఇటువంటి నిబంధన చేర్చడం దేశంలో ఇదే మొదటిసారి.
కోర్టు కష్టాలు దాదాపుగా తీరినట్టే!
ఏమైనా అభ్యంతరాలుంటే పై అధికారులకు అప్పీలు చేసుకునే వ్యవస్థ ధరణి చట్టంలో లేదు. బాధితులు నేరుగా కోర్టుకెళ్లాల్సిందే. చాలామందిని ఇబ్బంది పెట్టిన ఈ లోపాన్ని భూభారతి సరిదిద్దింది. పాసు పుస్తకాల్లో గాని భూధార్ నంబర్పై గానీ అభ్యంతరాలుంటే వెంటనే ఆర్డీవోకు, ఆర్డీఓ ఇచ్చిన తీర్పుమీద అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. అటు.. ఆర్డీఓ చేసిన మ్యుటేషన్లపై అభ్యంతరాలున్నా కలెక్టర్ దగ్గరికెళ్లే అవకాశముంది. కలెక్టర్ ఇచ్చే తీర్పు మీద అనుమానాలుంటే ట్రైబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు. సో.. కోర్టుల చుట్టూ తిరిగే తంటా లేనట్టేగా..?
2017 సెప్టెంబరు ముందు వరకు పట్టా ఉన్నప్పటికీ అధికారులు చేసిన తప్పుల కారణంగా కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేని రైతులు కొందరుంటారు. వాళ్లందరిరికీ కొత్త చట్టంతో పాసుపుస్తకం జారీ ఔతుంది. ఇటువంటి వెసులుబాట్లు అనేకం. గతంలో వీఆర్వోలు ఆడిందే ఆట. భూమిలేని వాళ్లకే పట్టాదారు పుస్తకాలిచ్చి.. రైతుబంధుకు అప్లయ్ చేసుకోవచ్చంటూ ముందస్తుగా లంచాలు గుంజేవాళ్లని ఆరోపణలున్నాయి. ఇప్పుడు కూడా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అగత్యం తప్పదా అని అనుమానాలు. పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే తప్ప కొత్త చట్టం మీద నమ్మకాలు కుదిరే పరిస్థితి లేదనేది రైతు సంఘాల మాట. కానీ.. అధికారుల ప్రమేయం నామమాత్రమేనని, రైతులు భయపడాల్సిన పనే లేదని భరోసానిస్తోంది ప్రభుత్వం.
ఏకకాల సర్వీసులు, మ్యుటేషన్పై అప్పీల్
ధరణి చట్టంలో.. ఒకేసారి రిజిస్ట్రేషన్-మ్యుటేషన్, వారసత్వ బదిలీ, బహుమతి, మార్ట్గేజ్, నాలా సేవలన్నీ అందించే వీలుండేది. కానీ, అభ్యంతరాలకు అవకాశం కల్పించలేదు. భూభారతి చట్టంలో వారసత్వ బదిలీ మినహా అన్ని లావాదేవీల్లో ఏకకాల రిజిస్ట్రేషన్-మ్యుటేషన్ సేవలు భూభారతిలో యథాతథం. మ్యుటేషన్పై అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఇందులో అదనం.
అన్ని భూములకూ లావాదేవీలు!
ధరణిలో ఉన్న భూములకు సంబంధించి మాత్రమే లావాదేవీలు జరిపేందుకు అర్హత ఉండేది. వాటికి మాత్రమే పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. సమస్యలకు పరిష్కారం కోసం ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. భూభారతి చట్టం ప్రకారం.. పోర్టల్లో సమాచారం ఉన్న భూముల్ని సైతం అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు. సాగులో ఉండికూడా హక్కులు రాని దాదాపు 8 లక్షల ఎకరాలకు చెందిన రైతులకు కొత్త చట్టం ద్వారా రిలీఫ్ దొరికినట్టే.
వివాదాలు ఉంటే అంతే సంగతులు
దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా హక్కుల్లో ఏమైనా వివాదాలు ఉంటే ఆ భూములను పార్ట్-బీ కింద పక్కన పెట్టేసింది ధరణి చట్టం. భూభారతి చట్టం ప్రకారం పార్ట్-బీ కింద ఉన్న 18 లక్షల ఎకరాల భూముల్లో.. చిన్నచిన్న వివాదాలు, హద్దుల సమస్యలు, మ్యుటేషన్పై ఫిర్యాదులు ఉంటే అధికారులు విచారణ జరుపుతారు.
వారసత్వ బదిలీ చిక్కులు
ధరణి చట్టం ప్రకారం వారసత్వ బదిలీకి కుటుంబ సభ్యుల ఉమ్మడి అంగీకార పత్రం, సభ్యుల హాజరు తప్పనిసరి. కానీ.. అధికారులకు నోటీసులు జారీచేసే హక్కు లేదు. స్లాటు నమోదు చేసుకుంటే చాలు.. వారసత్వ బదిలీ సులభంగా పూర్తయ్యేది. కొత్త చట్టం ప్రకారం వారసత్వ బదిలీ విషయంలో కుటుంబసభ్యులకు నోటీసు జారీ చేసే అధికారం తహసీల్దారుకు ఉంటుంది.
క్షేత్రస్థాయి విచారణ
ధరణి చట్టం ప్రకారం అసైన్డ్ భూములపై క్షేత్రస్థాయి విచారణ ఉండేది కాదు. స్పష్టత ఉందని భావించిన భూములకు మాత్రమే పాస్పుస్తకాలు దొరికేవి. ఆ కారణంగా 24 లక్షల ఎకరాల ఎసైన్డ్ భూములకు గతంలో పాసుపుస్తకాలు జారీ కాలేదు. కొత్త చట్టం ప్రకారం.. రైతులు దరఖాస్తు చేసుకోకపోయినా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేలా వెసులుబాటు ఉంది. ఏదైనా వివాదం ఉంటే విచారణ జరిపి పాస్ బుక్కు ఇచ్చేస్తారు.
ధరణి చట్టం ప్రకారం పాస్ పుస్తకాల రద్దు అధికారం జిల్లా కలెక్టర్కు మాత్రమే అప్పగించారు. అప్పీలుకు అవకాశమే ఉండేది కాదు. కొత్త చట్టంలో పాస్ పుస్తకాల రద్దు అధికారం ఆర్డీవోకు అప్పగించారు. చర్యలపై అప్పీళ్లకూ అవకాశం కల్పించింది కొత్త చట్టం. ధరణి చట్టం అమల్లో ఉన్నప్పుడు భూమి ఖాతా, సర్వే సంఖ్యతో పాటు పాస్బుక్కుపై బార్ కోడ్ కూడా ఉండేది. ఫోన్ నంబరుకు వచ్చే మెసేజ్, ఆధార్ నంబర్ ఆధారంగా మాత్రమే లావాదేవీలు నిర్వహించేవారు. కొత్త చట్టంలో మాత్రం.. ప్రతి ఖాతాకు ప్రత్యేకంగా తాత్కాలిక భూధార్ సంఖ్య కేటాయిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత శాశ్వత భూధార్ ఇస్తారు. భూమి ఖాతా, సర్వే సంఖ్య, బార్ కోడ్ యధావిధిగా కొనసాగుతుంది.
కోటి మంది ఒకేసారి లాగిన్ చేసినా తట్టుకునేలా ఈ పోర్టల్ కోసం భారీ సర్వర్ రూపొందించారు. పదేళ్ల పాటు ధరణి కారణంగా రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు చెక్ పెడుతూ.. వందేళ్ల పాటు నడిచేలా.. భూసమస్యలకు వందశాతం పరిష్కారం లభించే దిశగా పోర్టల్ని అప్డేట్ చేసుకోవాలి. భూభారతి చట్టం.. రేవంత్ సర్కార్ పాపులర్ పథకాల్లో ఒకటి. పోయినేడాది డిసెంబర్లోనే తీసుకొచ్చింది ప్రభుత్వం. అమలు చేసేందుకు అవసరమైన గైడ్లైన్స్ రెడీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు పోర్టల్ కూడా వచ్చేసింది. ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక దశలవారీగా ముందుకెళ్తోంది ప్రభుత్వం. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరించి పోర్టల్ను మరింత బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం.
జూన్ రెండున రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతోంది భూభారతి చట్టం. ఇన్నాళ్లూ ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు.. ఇకపై భూభారతి పోర్టల్లోనే జరుగుతాయి. త్వరలోనే గ్రామపాలన అధికారులను నియమించి.. యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది ప్రభుత్వం. నిర్వీర్యమౌతున్న రెవిన్యూ వ్యవస్థ భూభారతి చట్టంతో నిలదొక్కుకుంటుంది అనేది రేవంత్ ప్రభుత్వ ఆశాభావం. చట్టం చేయడం కాదు.. దాని అమలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అధికారులతో సమర్థంగా పనిచేయించుకోవాలి. నిబద్ధత లేని అధికారుల్ని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుంది. ధరణి.. రైతుల నడ్డి విరిచేది.. పాలకుల కుంభకోణాలకు పునాది.. అని గతంలో బీజేపీ అధ్యక్షుడే తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు భూభారతి చట్టంపై కమలం పార్టీ నుంచి ఎటువంటి వ్యతిరేకతా రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ధరణి కంటే బెటర్గా పెర్ఫామ్ చేస్తేనే.. ధరణి కంటే ఎక్కువ మేలు చేస్తేనే భూభారతికి మార్కులు పడేది.
గతంలో పరిష్కారాల కోసం తీసుకొచ్చిన ధరణి చట్టం.. సమస్యల్నే ఎక్కువగా పుట్టించింది. మరో మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణాల్లో ధరణి కూడా ఒకటి. ధరణిపై జనంలో ఉన్న వ్యతిరేకతను తెలివిగా వాడుకున్నారు కనుకే రేవంత్రెడ్డికి ఎడ్వాంటేజ్ దక్కింది. ఇప్పుడు మళ్లీ భూభారతి చట్టం ద్వారా అపోజిషన్ పార్టీలకు అటువంటి అవకాశం ఇవ్వకూడదన్నది ప్రభుత్వ ఆలోచన.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..