ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..

ఘోరం.. భవనం కూలిన ఘటనలో 11 మంది మృతి.. పాపం అంతా నిద్రలోనే..


ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ కూలి 11మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనం సృష్టించింది. ముస్తఫాబాద్‌లోని శక్తివిహార్ ప్రాంతంలో నిన్న తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఓ భవనం సడెన్‌గా నేలమట్టం అయింది. దాంతో.. నిద్రలో ఉన్న 11మంది ప్రాణాలు నిద్రలోనే గాలిలో కలిసిపోవడం కలసి వేస్తోంది. NDRF, ఫైర్‌ సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, స్థానికులు దాదాపు 12 గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కున్నవారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో భవన యజమానితోపాటు అతని కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మిగతావారు కూడా అతని బంధువులుగానే గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన మరో 11మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు డిశ్చార్జ్ కాగా.. మిగతావారు చికిత్స పొందుతున్నారు.

భవనం కూలడంతో మొత్తం 22 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 2.39 గంటలకు ఈ ప్రమాదం జరిగిందన్నారు ఢిల్లీ పోలీసులు. సమాచారం అందిన వెంటనే.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఢిల్లీ ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి.

అయితే.. ప్రమాదానికి గురైన బిల్డింగ్‌ 20 ఏళ్ల నాటిదిగా ఐడెంటిఫై చేశారు. ప్రమాదానికి ముందు ఢిల్లీలో భారీ వర్షం కురవగా.. దాని ప్రభావంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *