అందమైన కశ్మీరంలో ఉగ్రమూకల పిరికిపంద చర్యకు యావత్ దేశం ఉలిక్కిపడింది. అమాయకుల ప్రాణాలే టార్గెట్గా రెచ్చిపోయిన ముష్కరులు అత్యంత హేయంగా దుశ్చర్యకు దిగారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో మొత్తం 28 మంది మరణించారు.. చాలా మంది తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. వెతికి మరీ, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య.. దేశంతోపాటు.. ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. జమ్ముకశ్మీర్ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిపై అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చనిపోయిన వారికి నివాళులర్పించడడంతోపాటు.. రోడ్లపైకి వచ్చి.. పాకిస్తాన్ పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రతిచర్య తీసుకోవాల్సిందే అంటూ ముక్తకంఠంతో కోరుతున్నారు.
పహల్గామ్ దుర్ఘటనపై జమ్మూకశ్మీర్ లో ముస్లింలు సైతం ఆవేదన వ్యక్తంచేస్తున్నారు… ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. చనిపోయిన వారికి నివాళులర్పించడంతోపాటు.. తమకు అపఖ్యాతి మూటగట్టిన ఉగ్రమూకలపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో.. ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది.. శ్రీనగర్ లో శుక్రవారం చారిత్రాత్మక జామియా మసీదు వద్ద జరిగిన జుమ్మా సామూహిక ప్రార్థనల సందర్భంగా, పహల్గామ్ ఉగ్రవాద దాడి మృతుల జ్ఞాపకార్థంగా ముస్లింలు ఒక నిమిషం మౌనం పాటించారు.

Pahalgam Terrorist Attack
జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం చెలరేగినప్పటి నుంచి ఈ జామియా మసీదు వేర్పాటువాదుల కేంద్రంగా ఉంది.. అలాంటి మసీదులో మృతులకు నివాళులర్పిస్తూ.. మౌనం పాటించడం గమనార్హం. హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు, ముస్లిం మతనాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నాలుగు వారాల తర్వాత జామియా మసీదును సందర్శించి శుక్రవారం ప్రసంగం ఇవ్వడానికి అనుమతించబడ్డారు. ఆయన బాధితమృతులకు నివాళులర్పించడంతోపాటు మౌనం పాటించారు.. అనంతరం మాట్లాడారు.
ఇటీవల UAPA కింద కేంద్రం నిషేధించిన అవామీ యాక్షన్ కమిటీ (AAC) పార్టీని కలిగి ఉన్న మిర్వైజ్, పహల్గామ్లో యాత్రికులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. “ఈ మారణహోమం ఎలా జరిగింది – వారి గుర్తింపులను నిర్ధారించుకున్న తర్వాత, వారి కుటుంబాల ముందు రెండు డజన్లకు పైగా ప్రజలు చంపబడ్డారు – ఇది దిగ్భ్రాంతికరమైనది.. నమ్మశక్యం కానిది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. దశాబ్దాలుగా ఈ బాధను అనుభవిస్తూ… కొనసాగిస్తూనే ఉన్న ప్రజల కంటే బాధిత కుటుంబాలకు కలిగే బాధ, దుఃఖాన్ని ఎవరు బాగా అర్థం చేసుకోగలరు” అంటూ ఆయన పేర్కొన్నారు.
జామియా మసీదు వేర్పాటువాదుల కేంద్రంగా కొనసాగుతుండటం, ఇప్పటికీ భద్రతా కారణాలను చూపుతూ అధికారులు కాశ్మీర్లోని గ్రాండ్ మసీదులో ప్రార్థనలను నిరాకరిస్తున్నారు.. ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఈద్-ఉల్-ఫితర్ నాడు కూడా, అధికారులు జామియా మసీదులో ఈద్ ప్రార్థనలను అనుమతించలేదు.
ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఏమన్నారంటే..
వేర్పాటువాదుల కేంద్రంగా ఉన్న జామియా మసీదులో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. కాశ్మీరీలపై ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఛానళ్లు ఇలాంటి వాటిని ప్రసారం చేయవని.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..