మహారాష్ట్రలో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుకలో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కూతురిని కాల్చి చంపి, అల్లుడిని తీవ్రంగా గాయపరిచారు. శనివారం సాయంత్రం ఒక వివాహ వేడుకలో ఈ కాల్పుల సంఘటన జరిగింది. తన కూతురి ప్రేమ వివాహం పట్ల తీవ్రంగా కలత చెందిన ఓ తండ్రి, తన రివాల్వర్తో తన కూతురు, అల్లుడిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. దీంతో కూతురు అక్కడికక్కడే మృతి చెందింది. అల్లుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జల్గావ్లోని చోప్రా తహసీల్ ప్రాంతంలో శనివారం(ఏప్రిల్ 26) రాత్రి ఒక వివాహ వేడుక జరుగుతోంది. ఈ వేడుకకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) రిటైర్డ్ అధికారి కిరణ్ మాంగ్లే (50) హాజరయ్యారు. ఇక్కడ తన కూతురు త్రిప్తి, అల్లుడు అవినాష్ కూడా అక్కడికి చేరుకున్నారని చూశాడు. తన కూతురిని, అల్లుడిని చూసి కిరణ్ మంగ్లే కోపంతో రగిలిపోయాడు. అతను పెళ్లిలోనే తన రివాల్వర్ తీసి వారిద్దరిపై అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. దీని కారణంగా కుమార్తె త్రిప్తి అక్కడికక్కడే మరణించింది. కాగా, అల్లుడు అవినాష్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అవినాష్ను అక్కడున్న వారంతా ఆసుపత్రికి తరలించారు.
తహసీల్ ప్రాంతంలో వివాహ వేడుకలో కాల్పుల సంఘటన కలకలం సృష్టించింది. హఠాత్తు పరిణామంతో అందరూ భయబ్రాంతులకు గురయ్యారు. దీని తరువాత, వివాహ వేడుకకు వచ్చిన కొంతమంది కిరణ్ మంగ్లేను పట్టుకున్నారు. మొదట అతన్ని తీవ్రంగా కొట్టి, ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. మాంగ్లే కుమార్తె త్రిప్తి, అవినాష్ ఒక సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుండి వారిద్దరూ పూణేలో నివసిస్తున్నారు. తన కూతురి ప్రేమ వివాహంతో ఆ తండ్రి తీవ్ర మనస్తాపం చెంది ఈ హత్యకు పాల్పడ్డట్లు బంధువులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, త్రిప్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం కోసం పంపారు. అలాగే, అవినాష్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. కిరణ్ మంగ్లేను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..