అమరావతి రాజధాని రీలాంచ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని టూర్ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49వేల 40 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్ట్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. డీఆర్డీవో, డీపీఐఐటీ, ఎన్హెచ్ఏఐ, రైల్వేశాఖల్లో 57వేల 962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోదీ. నాగాయలంకలో 15వందల కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్కు శంకుస్థాపన చేస్తారు.
ప్రధానితో పాటు వేదికపై మొత్తం 14 మంది కూర్చోనున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు… రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్రాల మంత్రులు కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు మూడు వేర్వేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసినా.. వేదిక మాత్రం ఒక్కటే. సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. ప్రధాని భద్రతా కారణాల రీత్యా హెలిపాడ్ నుంచి కారులో నుంచే అభివాదం చేస్తూ వేదిక చేరుకుంటారు మోదీ. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను రేపు ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి అనుమతిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు సూచించారు. వర్షం పడినా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాని సభకు రావాలంటూ రాజధాని మహిళలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి మహిళలను ఆహ్వానించింది CRDA. ప్రొటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ప్రధాని వేదికపైకి రాగానే అమరావతి రీస్టార్ట్ పైలాన్ సహా వివిధ ప్రాజెక్టుల పనులు ప్రారంభించనున్నారు. అమరావతిలో మొదటి అక్షరం A ఆకారంలో పైలాన్ నిర్మిస్తున్నారు. 21 అడుగుల ఎత్తుతో, పూర్తి గ్రానైట్ స్టోన్తో నిర్మించిన ఈ పైలాన్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..