ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు. సమంత మాట్లాడుతూ.. నటిగా ఓ శుక్రవారం ఎలా ఉంటుందో నాకు అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. ఎంతో నర్వెస్గా ఉన్నాను. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. గత వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ టీం, మిక్సింగ్ టీం, ఎడిటింగ్ ఇలా అందరూ నిద్ర లేకుండా పని చేస్తున్నారు. నాకు నా టీం మీద మరింత గౌరవం పెరిగింది. ‘శుభం’ చిత్రం చాలా బాగా వచ్చింది. మంచి కథ. సినిమాపై నాకు చాలా నమ్మకం ఉంది.
నటిగా నేను ఎంతో చూశాను. ఎంతో అభిమానం లభించింది. కానీ ఇంకా ఏదో చేయాలనే తపన, కోరిక మాత్రం ఉంటూ వచ్చింది. నేను తీసుకున్న ఆ బ్రేక్ టైంలో చాలా ఆలోచించాను. హీరోయిన్గా నేను ఏ సినిమాలు చేయలేకపోయాను. అసలు ఇక సినిమాల్లో నటిస్తానో కూడా తెలియని సమయంలో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది. నటించకపోతేనేం సినిమాలు నిర్మించొచ్చు కదా అని అనుకున్నాను. కెరీర్ మొదలు పెట్టి దాదాపు 15 ఏళ్లు అయింది. నాకు ఇంత అనుభవం ఉంది కదా అని ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఎలాంటి హడావిడి లేకుండా సినిమాను ప్రారంభించాం. 8 నెలల్లోనే చిత్రాన్ని పూర్తి చేశాం. ఇప్పుడు ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం.
‘శుభం’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా సీరియల్ గురించి ఉంటుంది.. ఆ సీరియల్లో శుభం కార్డ్ ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఇక నా ప్రొడక్షన్ కంపెనీకి ట్రా లా లా అని పెట్టడానికి కూడా కారణం ఉంది. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రెయిన్’ అనే పద్యం ఉండేది. అందుకే ట్రా లా లా అని పెట్టాం. గౌతమ్ మీనన్ గారు నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తల్చుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్ అయినా నటించేవారు. కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నాను అని సమంత అన్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.