ఓ స్కూల్లో రినోవేషన్ పనులు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా.. వారికి ఓ మారు మార్బుల్ రాళ్ల కింద నుంచి ఏవో వింత చప్పుళ్లు వినిపించాయి. మొదటిగా అవేవో ఎలుకలు లేదా పందికొక్కులు అయి ఉంటాయిలే అనుకునేరు. కానీ అదే భయం భయంగా కొంచెం కొంచెంగా తవ్వి చూశారు. అంతే.! బయటపడింది చూసి దెబ్బకు షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మెక్సికోలోని ఓ ప్రాధమిక పాఠశాల కింద పిల్లల శ్మశానవాటిక ఒకటి బయటపడింది. ఎముకలు, పుర్రె లాంటివి బయటపడటం చూసి విద్యార్ధులకు దెబ్బకు దడుసుకున్నారు. స్కూల్ పునరుద్ధరణ పనుల్లో భాగంగా కూలీలు గోతులు తవ్వుతుండగా.. ఈ వింతైన శ్మశానవాటిక బయటపడింది. 80 చదరపు సెంటీమీటర్ల కుహరంలో ఎనిమిది మంది పిల్లలు, ఒక యువకుడి అస్థిపంజర అవశేషాలను కనుగొన్నారు. 80 x 35 సెం.మీ. కొలతలు కలిగిన చెక్క శవపేటికలో ఓ చిన్నారి అస్థిపంజరం లభ్యమైంది. ఆ శవపేటికను నీలం, వజ్రాల ఆకారపు చెక్కడాలతో అలంకరించడమే కాదు.. అవశేషాలను గోధుమ రంగు కవచంలో చుట్టి ఉంచారు.
మెక్సికోలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంత్రోపాలజీ అండ్ హిస్టరీ(INAH) నిపుణులు ఈ బయటపడ్డ స్మశానాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఖనన ఆచారాలు కొంచెం కొత్తగా ఉండటంతో.. ఆ ఆస్థిపంజరాలు ఏకాలం నాటివి అనేది చెప్పలేకపోతున్నారు. ఈ ఆస్థిపంజరాలతో పాటు 1862 నాటి ఓ నాణేన్ని గుర్తించడంతో.. వీరందరినీ 19వ శతాబ్దంలో ఖననం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అలాగే స్కూల్ కింద తవ్విన గొయ్యి నుంచి బటన్లు, వస్త్రపు ముక్కలు, సిరామిక్స్, లోహాలు, వింత భాషలో రాసిన ఓ కాగితం ముక్క స్వాధీనం చేసుకున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు. వీటన్నింటిని గ్వాడాలుపేలోని ఓ మ్యూజియానికి తరలించారు. కాగా, ఆ అస్థిపంజరాలపై లోతైన దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
