ఏపీలో ఒకే రోజు ఏడుగురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురం గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు అడుకుంటూ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు గౌతమి, శాలిని, అశ్విన్ నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. బిడ్డల మృతితో తీవ్ర శోకంలో ఉన్న తల్లిదండ్రులకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు.
మరోవైపు విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామంలో కారు డోర్లు లాక్ పడిన సంఘటనలో నలుగురు చిన్నారులు చనిపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు…ఆగి ఉన్న ఒక కారు ఎక్కగా డోర్ లాక్ పడి బయటకు రాలేక అందులోనే చనిపోయిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. కారులో చిక్కుకుని ఊపిరి అందక ఉదయ్, జాశ్రిత, చారులత, మణీశ్వరి ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. రెండు ఘటనల్లో 10 ఏళ్లు కూడా నిండని బిడ్డలు చనిపోవడం తనను తీవ్ర వేదనకు గురిచేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటనలో తెలియజేశారు.
మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ సంఘటనలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రెండు వేరు వేరు ప్రమాదాల్లో ఏడుగురు చిన్నారులు చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..