Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: దసరాకు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ 103 రైల్వేస్టేషన్లలో హైదరాబాద్‌లోని బేగంపేట్‌తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లతో పాటు ఏపీలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్‌ ఉన్నాయి. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట స్టేషన్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద రూ 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట స్టేషన్‌‌ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. రూ.25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కేంద్రప్రభుత్వం చేపట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. అటు రూ. 25.85 కోట్లతో కరీంనగర్‌ స్టేషన్‌ అభివృద్ధి చేసింది కేంద్రప్రభుత్వం. ఇక తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ను రూ. 15 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా తీర్చిదిద్దింది కేంద్రం.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన బేగంపేట రైల్వే స్టేషన్‌ను పూర్తిగా మహిళా ఉద్యోగులే నిర్వహించడం గర్వకారణమన్నారు కిషన్ రెడ్డి. భారతదేశ నారీ శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. దేశంలో 1,300 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లను కేంద్రం ఏకకాలంలో పునరాభివృద్ధి చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్ల తీర్చిదిద్దుతున్నామన్నారు. 2026 నాటికి, ఈ స్టేషన్లు స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా అభివృద్ధి చేయబడతాయన్నారు. ఈ 40 స్టేషన్లతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ. 720 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు.

నాంపల్లి (హైదరాబాద్) రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది ఈ రెండు స్టేషన్‌లను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,337 కోట్లు కేంద్రం కేటాయించింది. అలాగే కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని ప్రధానమంత్రి మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భూమి పూజ చేశారు. ఈ స్టేషన్‌ను ఈ సంవత్సరం దసరా సందర్భంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు అంకితం చేస్తామన్నారు కిషన్ రెడ్డి.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా MMTS ఫేస్-2 ఆరేడు సంవత్సరాలు ఆలస్యం అయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతు లేకపోయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో MMTS ఫేస్-2 నిర్మాణ పనులు దాదాపు రూ.1,000 కోట్ల వ్యయంతో ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్టకు MMTS ఆమోదం పొందింది. త్వరలో రూ. 400 కోట్లతో పనులు ప్రారంభమవుతాయన్నారు కిషన్ రెడ్డి. 121 మానవరహిత లెవల్ క్రాసింగ్‌లను తొలగించాం. 203 కొత్త రోడ్ అండర్ బ్రిడ్జిలు, 43 ROBలు, 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను కేంద్రం నిర్మించింది. అభివృద్ధిని తక్కువ చేసి ట్విట్టర్‌లో విమర్శించే మాజీ మంత్రి వాస్తవాలను అర్థం చేసుకోవాలని హితవు పలికారు కిషన్ రెడ్డి. 174 స్టేషన్లలో హై-స్పీడ్ వై-ఫై సౌకర్యం, 88 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రూ. 580 కోట్లతో కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. రాబోయే నాలుగు సంవత్సరాలలో, తెలంగాణలో రైల్వే అభివృద్ధి విప్లవాత్మక రీతిలో జరుగుతుంది.

రాష్ట్రంలోని అనేక రైల్వే ప్రాజెక్టులు ప్రస్తుతం భూసేకరణ సమస్యలను ఎదుర్కొంటున్నాయి, ఇది పురోగతిని నెమ్మదిస్తోంది. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు అప్రోచ్ రోడ్డు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విస్తరణ కోసం భూసేకరణ పెండింగ్‌లో ఉంది. ఈ అభివృద్ధి పనులు వేగంగా జరగాలంటే, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలి. భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్టు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోందని.. దీనికి ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు కిషన్ రెడ్డి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *