హైదరాబాద్ నగర వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద 2,000 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హైదరాబాద్కు ఎలక్ట్రిక్ బస్సుల కేటాయింపుపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలకు బస్సుల కేటాయింపుపై దృష్టి సారించారు. ఈ పథకం కింద హైదరాబాద్తో పాటు బెంగళూరుకు 4,500, ఢిల్లీకి 2,800, అహ్మదాబాద్కు 1,000, సూరత్కు 600 ఎలక్ట్రిక్ బస్సులను అందజేయనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రస్తుతం సుస్థిర పట్టణ రవాణా దిశగా దృఢమైన అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది అన్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు, నగరాలు ప్రజా రవాణాను మరింత పరిశుభ్రంగా, సైకర్యవంతంగా మార్చేందుకు ఈవీ బస్సులను చురుకుగా స్వీకరిస్తున్నాయని అన్నారు. తాము ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించడమే కాకుండా, కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణతో భారత రవాణా వ్యవస్థ భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పీఎం ఈ-డ్రైవ్ హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు.
పీఎం ఈ-డ్రైవ్ పథకం ద్వారా 2024 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు రూ.10,900 కోట్ల వ్యయంతో 14,028 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని ఆయన తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ ప్రయత్నాలలో ఒకటిగా నిలుస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం కింద కొనుగోలుదారులు డిమాండ్ ఇన్సెంటివ్ను పొందేందుకు ఈ-వోచర్లను కూడా మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిందన్నారు. ఇవే కాకుండా పీఎం ఈ-డ్రైవ్ కింద ఈ-ఆంబులెన్స్లు, ఈ-ట్రక్కులను కూడా కేంద్ర అందుబాటులోకి తీసుకురానుందన్నారు. ఇందు కోసం రూ.500 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..