
ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విదేశాల్లో పర్యటిస్తున్నారు. పహాల్గామ్లో ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ముగిసిన అనంతరం ఈ విదేశాల్లో పర్యటిస్తూ.. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని ఆయాదేశాల నేతలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం బ్రస్సెల్స్లో యూరోపియన్ యూనియన్ (EU) నాయకులతో సమావేశమయ్యారు. పాకిస్తాన్పై భారతదేశం తీసుకున్న చర్యను రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యగా చూడాలని ఆయన పాశ్చాత్య దేశాలకు సూచించారు.
ఈ సందర్భంగా యూరోపియన్ వార్తా వెబ్సైట్ యూరాక్టివ్తో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, యూరప్ మారుతున్న భౌగోళిక రాజకీయాల గురించి, భవిష్యత్తులో మెరుగైన EU-భారత్ సంబంధాల కోసం ఆశల గురించి కూడా మాట్లాడారు. భారతదేశం, రష్యా, చైనా మధ్య పెరుగుతున్న సంబంధాల మధ్య తన భాగస్వామ్యాలను వైవిధ్యపరచడానికి ప్రయత్నిస్తున్నందున భారతదేశం యూరోపియన్ యూనియన్తో ఒక ప్రధాన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ను యూరప్ రెండు దేశాల మధ్య సంఘర్షణగా చూపించిన తీరును విదేశాంగ మంత్రి జై శంకర్ విమర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒసామా బిన్ లాడెన్ అనే ఉగ్రవాది, వెస్ట్ పాయింట్ పక్కన ఉన్న పాకిస్తాన్ సైనిక పట్టణంలో అతను సంవత్సరాలుగా ఎందుకు సురక్షితంగా ఉన్నాడు? ఇది కేవలం భారతదేశం-పాకిస్తాన్ సమస్య కాదని ప్రపంచం అర్థం చేసుకోవాలన్నారు. ఇది ఉగ్రవాదం గురించి అని, ఈ ఉగ్రవాదం మిమ్మల్ని (యూరప్) కూడా వెంటాడుతుందని విదేశాంగ మంత్రి జై శంకర్ హెచ్చరించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ, ఉక్రెయిన్ దాడి తర్వాత రష్యాపై ఆంక్షలు విధించడంలో యూరోపియన్ యూనియన్ సహా ఇతర పాశ్చాత్య దేశాలతో భారతదేశం ఎందుకు చేరలేదని అడిగినప్పుడు, యుద్ధం ద్వారా శాంతి రాదనే భారతదేశ వైఖరిని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. యుద్ధం ద్వారా కాకుండా శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. యుద్ధభూమి నుండి ఎటువంటి పరిష్కారం ఉద్భవిస్తుందని గట్టిగా నమ్ముతున్నామని ఆయన అన్నారు.
పరిష్కారం ఏమిటనేది నిర్ణయించడం మా పని కాదని ఎస్ జైశంకర్ అన్నారు. ‘‘మేము నిర్దేశక, నిర్ణయాత్మకం కాదు, మేము ఇందులో పాల్గొనము. భారతదేశం ఉక్రెయిన్-రష్యా రెండింటితోనూ బలమైన సంబంధాలను కలిగి ఉందని’’ ఆయన స్పష్టం చేశారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేసినప్పుడు, పాశ్చాత్య దేశాలు ఇస్లామాబాద్కు మద్దతు ఇచ్చాయని జైశంకర్ గుర్తు చేశారు.
సహజంగానే ప్రతి దేశం తన సొంత అనుభవాన్ని, చరిత్రను, ఆసక్తులను పరిగణనలోకి తీసుకుంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన కొన్ని నెలలకే భారతదేశ సరిహద్దులను ఉల్లంఘించారు, పాకిస్తాన్ కాశ్మీర్లోకి ఆక్రమణదారులను పంపినప్పుడు, పాకిస్తాన్కు ఎక్కువగా మద్దతు ఇచ్చిన దేశాలు యూరోపియన్ దేశాలు అని జైశంకర్ పేర్కొన్నారు. పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన ఒక నెల తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్ యూరప్లో పర్యటిస్తున్నారు. EU వాతావరణ విధానంలోని అంశాలను, ముఖ్యంగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (CBAM)లోని అంశాలను భారతదేశం వ్యతిరేకిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..