చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?

చేయి దాటిపోతున్న ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు..! మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా?


క్షిపణి దాడులు, బాంబు శబ్ధాలతో పశ్చిమ ఆసియా దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ పరస్పర దాడులతో ఈ పరిస్థితి నెలకొంది. మరి ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న దాడులు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అంటే చాలా మంది నిపుణుల నుంచి అవును అనే సమాధానమే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే ఈ రెండు దేశాలు కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాలు, శాంతి కంటే కూడా యుద్ధం చేయడానికే ఎక్కువగా ఇష్టపడే దేశాలు. అందుకే.. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధంపై యావత్‌ ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

దాడులు ఎందుకు మొదలయ్యాయి..?

ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ పేరుతో ఇరాన్‌లోని అణు స్థావరాలపై ఇజ్రాయిల్‌ ఊహించని దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌ అత్యున్నత సైనిక దళమైన ఇస్లామిక్ రివల్యూష నరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ మరణించారు. అలాగే 78 మంది మృత్యువాతపడ్డారు. తమపై జరిగిన ఈ దాడిని ఇరాన్ ప్రభుత్వ చాలా సీరియస్‌గా తీసుకుంది. వెంటనే ఆపరేషన్‌ ట్రూప్రామిస్‌ 3 పేరుతో ఇరాన్‌ సైతం ఇజ్రాయిల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్‌ రాజధాని టెల్‌ అవీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. ఎంత ప్రాణ నష్టం జరిగింది? ఎంత ఆస్తి నష్టం జరిగింది అనే విషయాలపై ఇంకా స్పష్టమైన సమాచారం లేనప్పటికీ.. ఇరు దేశాలు ఈ స్థాయిలో దాడులకు తెగబడటం కచ్చితంగా ఇరు దేశాలకు తీవ్ర నష్టం అయితే తెచ్చిపెట్టనున్నాయి.

అమెరికా ప్రమేయం..?

ఇరాన్‌పై ఆకస్మిక దాడులకు దిగిన ఇజ్రాయిల్‌ను పలు దేశాలు ఖండించాయి. చైనా నేతృత్వంలోని SCO కూటమి ఖండించింది. ఈ కూటమిలో చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, ఇండియా అనేక మధ్య ఆసియా దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అయితే.. ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ జరిపిన దాడుల వెనుక తమ ప్రమేయం లేదని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. కానీ, అమెరికా అనుమతి, మద్దతు లేకుండా ఇజ్రాయిల్‌ ఈ సాహసానికి ఒడిగట్టి ఉండేది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇజ్రాయిల్‌ వాదన..

ఇజ్రాయెల్ మనుగడకు ఇరాన్ నుంచి ఉన్న ముప్పును తొలగించడమే లక్ష్యంగా ఈ సైనిక చర్య చేపట్టాం అని ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు అన్నారు. అణు ముప్పు తొలగిపోయేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఆయన ప్రకటించారు. అంటే ఇప్పట్లో ఈ దాడులు ఆగే పరిస్థితి లేదు. శుద్ధి చేసిన యురేనియాన్ని ఆయుధాలుగా మార్చేందుకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. దీనిని ఆపకపోతే ఇరాన్ త్వరలోనే అణ్వాయుధాలను తయారుచేయగలదు. అది ఏడాది కావచ్చు లేదంటే కొన్నినెలలు, సంవత్సరంలోపే కావొచ్చు. ఇజ్రాయెల్ ఉనికికి ఇది స్పష్టమైన ముప్పు అని నెతన్యాహు అన్నారు. మరోవైపు ఇజ్రాయిల్‌ దాడుల తర్వాత అమెరికా ఇరాన్‌కు ఒక విజ్ఞప్తి చేసింది. శాంతి చర్చల కోసం ముందుకు రావాలని కోరింది.. కానీ, అమెరికా మాటను లెక్కచేయని ఇరాన్‌.. ట్రూప్రామిస్‌ 3 పేరుతో ఇజ్రాయిల్‌పై క్షిపణి దాడులు చేసింది. అంతర్జాతీయ సమాజం ఇదరు దేశాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుతున్నప్పటికీ.. ఇరాన్‌-ఇజ్రాయిల్‌ దాడులు చేయి దాటిపోయినట్లుగా అనిపిస్తోంది. ఒక వైపు అమెరికా ఇజ్రాయిల్‌కు మద్దతుగా మాట్లాడటం, మరోవైపు చైనా ఇరాన్‌పై ఇజ్రాయిల్‌ దాడులను ఖండించడం చూస్తుంటే.. ఇది చిలికి చిలికి గాలివాన మారి.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి దూకుడుగా వ్యవహరించే ఈ రెండు దేశాల మధ్య దాడులు ఎలా ఆగుతాయో? ఎక్కడికి దారి తీస్తాయో చూడాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *