జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..

జర్మనీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానం.. సడన్‌గా వెనక్కి.. ఏం జరిగిందంటే..


అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా తేరుకోనేలేదు. విమానం ప్రయాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ విమాన ప్రమాదాలు, హెలికాఫ్టర్‌ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఓవైపు విమానాల్లో సాంకేతిక లోపాలు..మరోవైపు బాంబు బెదిరింపులు వెరసి విమానాలు ఆలస్యం కావడం, క్యాన్సిల్‌ కావడం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాదు.. ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ఆందోళన చెందుతున్నారు. తాజాగా జర్మనీనుంచి హైదరాబాద్‌కు రావాల్సిన లుఫ్తాన్సా విమానం అనూహ్యంగా వెనుదిరిగింది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఎల్‌హెచ్752 విమానం టేకాఫ్ అయిన కొన్ని గంటల్లోనే వెనక్కి వెళ్లి, తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లోనే ఆదివారం సాయంత్రం ల్యాండ్ అయింది. ఈ ఘటనకు బాంబు బెదిరింపు కారణమని కొన్ని వర్గాలు చెబుతుండగా, ల్యాండింగ్‌కు అనుమతి లభించకపోవడమే కారణమని లుఫ్తాన్సా సంస్థ పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం లుఫ్తాన్సా విమానం ఆదివారం మధ్యాహ్నం 2:14 గంటలకు ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. ఈ విమానం సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం గాల్లోకి లేచిన సుమారు రెండు గంటల తర్వాత బాంబు బెదిరింపు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం. అయితే, లుఫ్తాన్సా సంస్థ ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రకటనలో ఈ వార్తలను ఖండించింది. హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ అవడానికి అనుమతి లభించకపోవడంతోనే వెనక్కి మళ్లించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్ లైవ్ ఫ్లైట్ ట్రాకర్ ప్రకారం విమానం ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో తిరిగి ఫ్రాంక్‌ఫర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. హైదరాబాద్‌లోని తన తల్లిని కలిసేందుకు వస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు మాట్లాడుతూ హైదరాబాద్‌లో విమానం ల్యాండ్ చేయడానికి అనుమతి రాలేదని తమకు చెప్పారని, సోమవారం ఉదయం 10 గంటలకు ఇదే విమానంలో మళ్లీ బయలుదేరుతామని పేర్కొన్నారని మరో జాతీయ వార్తా సంస్థకు వివరించారు. ప్రయాణికులందరికీ రాత్రి బస ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు.

ఇదిలా ఉంటే.. చెన్నైకి రావాల్సిన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్‌ విమానం లండన్‌లోని హిత్రో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన కాసేసటికి తిరిగి అదే విమానాశ్రయానికి చేరుకుంది. సాంకేతిక కారణాలతో విమానం వెనక్కి మళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. విమానం ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని, తమ బృందాలు తిరిగి విమానం బయలుదేరేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *