కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!

కుమార్తెలపై కోపంతో ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల రాసిచ్చిన తండ్రి.. తీరా విషయం తెలిసి..!


కుమార్తెలపై కోపంతో 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిపత్రాలను.. ఆలయ హుండీలో వేసేశాడు ఓ తండ్రి. మరి ఇప్పుడు ఆ ఆస్తి.. ఆ అమ్మాయిలకు దక్కుతుందా..! లేక అమ్మవారికి చెందుతుందా..? దీనిపై న్యాయస్థానం ఏం తేల్చనుంది..? ప్రస్తుతం ఇదే తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కథేంటో తెలుసుకోవాలంటే తిరువణ్ణామలై వెళ్లాల్సిందే..!

రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ ఓ ఆలయానికి 4 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని విరాళంగా ఇవ్వడం తమిళనాడులో హట్‌టాపిక్‌గా మారింది. తిరువణ్ణామలై జిల్లాలోని అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్.. తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివసిస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల్లో ఒకరైన కస్తూరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. మరో కుమార్తె సుబ్బులక్ష్మి వైద్యురాలిగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో అల్లుడి బంధువులు.. విజయన్‌ను బెదిరించడంతో వివాదం మరింత ముదిరింది.

ఆస్తుల విషయంలో కుమార్తెలు తన మాట వినకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు విజయన్‌. దీంతో 4 కోట్ల రూపాయల విలువచేసే తన రెండు ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ ఆలయంలోని హుండీలో వేశాడు. తన ఆస్తి అంతా ఆలయ ఖజానాకు చెందుతుందని ప్రకటించాడు. తాను కష్టపడి ఆస్తులను సంపాదించానని కానీ.. తన కుమార్తెలు ఆస్తి విషయంలో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు విజయన్‌. అందుకే తన ఇష్టపూర్వకంగా ఆలయానికి తన ఆస్తులను ఇస్తున్నట్టు ప్రకటించాడు.

మరోవైపు విషయం తెలుసుకున్న విజయన్‌ కుమార్తెలు.. తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తమకు ఇవ్వాలంటూ ఆలయ అధికారులను సంప్రదించారు. తమ తండ్రితో పాటు తల్లి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి ఆస్తులు సంపాదించిందని, వారిద్దరూ ఉమ్మడిగానే ఇళ్లు, పొలాలు కొనుగోలు చేశారని చెబుతున్నారు. తమ తండ్రి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆలయ ఖజానాకు తమ ఆస్తులను ఇచ్చారని అన్నారు. తిరిగి వాటిని తమకు ఇవ్వాలంటూ తమ భర్తలతో కలిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఆలయ అధికారులు మాత్రం విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ప్రకటించారు. మరోవైపు తమ కుటుంబ ఆస్తుల వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉందని, న్యాయస్థానం తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెబుతున్నారు విజయన్‌ కుమార్తెలు.

మరి న్యాయస్థానం ఈ ఆస్తి వివాదానికి ఏ విధమైన ముగింపు పలుకుతుందో చూడాలి. ఏది ఏమైనా కుమార్తెలపై కోపంతో ఆలయానికి 4 కోట్ల రూపాయల ఆస్తుల రాసిచ్చిన వ్యవహారం తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *